'భోజ్శాల'... సరస్వతీ మాత దేవాలయం
చారిత్రాత్మకమైన ధార్ నగరంలో వసంత పంచమిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సరస్వతీ మాత భక్తులు పెద్దసంఖ్యలో ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవాలయం 'భోజ్శాల'కు చేరుకుంటారు. ఆ సందర్భంగా యజ్ఞయాగాదులు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతుంటాయి. పర్మార్ రాజ వంశానికి చెందిన శిల్పకళా నైపుణ్యానికి భోజ్శాల నిదర్శనంగా నిలుస్తోంది. అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య వసంత పంచమి ఉత్సవాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్నాయి. చరిత్రను పరిశీలించినట్లయితే... ధార్ రాజ్యాధిపతి భోజ రాజు సరస్వతీ మాత భక్తుడు. భోజరాజు హయాంలో సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాజ్యంలో సామాన్య ప్రజలు సైతం సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని కలిగి ఉండేవారు. సంస్కృత భాషాధ్యయనం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ధార్ కేంద్రంగా ఉండేది. సరస్వతీ దేవి కరుణాకటాక్ష వీక్షణాలతో యోగ, సాంఖ్య, న్యాయ, జ్యోతిష, వాస్తు, రాజనీతి శాస్త్రాలలో భోజరాజు అపారమైన పాండిత్యాన్ని పొందారు. భోజరాజు రచనలు ప్రస్తుత కాలానికి సైతం వర్తిస్తాయి. క్రీస్తు శకం 1000 నుంచి 1055 వరకు భోజరాజు పాలన కొనసాగినట్లు చెప్పబడింది. ఉన్నత విద్యల నిమిత్తం ఆయన ఏర్పాటు చేసిన విద్యాకేంద్రం తదనంతర కాలంలో భోజ్శాలగా ప్రసిద్ధినొందింది. ఆనాటి సాహిత్యం ధార్ మరియు ధార్ పూర్వ వైభవాన్ని మన కనుల
ముందు నిలుపుతుంది.
శిల్పకళా వైభవం -
విశాలమైన ప్రాంతంలో చుట్టూ గోడలతో ప్రధాన హాలును కలిగి భోజ్శాల నిర్మితమైంది. రాతి స్థంభాల వరుస వెనుక పెద్ద ప్రార్థనామందిరం ఏర్పాటు చేయబడింది. రాతిస్థంభాల పైన భోజ్శాల అంతర్ నిర్మిత పై కప్పును ఆవరించి ప్రత్యేకమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నల్లరాతిపై చెక్కబడిన రెండు శాసనాలు అక్కడ కనిపిస్తాయి. శాసనాలలో ఒక సంస్కృత నాటకం లిఖితమై ఉంది. అర్జున్ వ్రమ దేవుని పాలనలో రాజగురువు మదనుడు రాసిన రచనలను శాసనాలు కలిగి ఉన్నాయి. ప్రముఖ జైనమతవేత్త ఆశాధరుని శిష్యుడు రాజగురువు మదనుడు. ప్రతి సంవత్సరం జరిగే వసంత పంచమి ఉత్సవాలలో ఈ నాటకం ప్రదర్శించబడుతుంది.
లండన్లో వాగ్దేవి...
ఒకానొకప్పుడు భోజ్శాల ఆవరణలో వాగ్దేవి (సరస్వతి) దేవాలయం ఉండేది. వాగ్దేవి నిలువెత్తు విగ్రహం భక్తులకు దర్శనమిచ్చేది. బ్రిటీష్ పాలకులు వాగ్దేవి విగ్రహాన్ని ఇంగ్లాండ్కు తరలించుకుపోయారు. వాగ్దేవి విగ్రహాన్ని ప్రస్తుతం లండన్లోని పురావస్తు ప్రదర్శనలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో వసంత పంచమి ఉత్సవ సమయంలో భక్తులు సరస్వతీ దేవి తైలవర్ణ చిత్రాన్ని పూజిస్తుంటారు.
భోజ్శాలకు గల చారిత్రక ప్రాధాన్యతను గుర్తెరిగిన భారత పురావాస్తుశాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కేవలం వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకుని సంవత్సరానికి ఒకసారి హిందువులను ఇక్కడకు అనుమతిస్తారు. అలాగే ప్రతి మంగళవారం హిందూ భక్తులు ఇక్కడకు విచ్చేసి సరస్వతి మాతను పుష్పాలు, అక్షింతలతో పూజించడానికి అనుమతించారు.
చేరుకునే మార్గం
రోడ్డు ద్వారా: 60 కి.మీ.ల దూరంలో గల ఇండోర్, 62 కి.మీ.ల దూరంలో గల రట్లం నగరాల నుంచి బస్సు మరియు ట్యాక్సీల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.
సమీప రైల్వే స్టేషన్: ఇండోర్ (60కి.మీ), రట్లం (62 కి.మీ).
సమీప విమానాశ్రయం: దేవీ అహల్య విమానాశ్రయం (60 కి.మీ).