ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
విఘ్నేశ్వరుడు, దేవతామూర్తులందరిలోనూ అత్యధిక సంఖ్యలో భక్తులచే ఇష్టదైవం... భక్తిప్రపత్తులతో పూజలందుకునే మహా శివుని కుమారుడు. కుడివైపున తొండము కలిగిన శ్రీ సిద్ధి వినాయకుని విగ్రహం 750 మి.మీ.ల ఎత్తు, 600 మి.మీల వెడల్పుతో ఏకశిల అయిన నల్ల రాతిపై చెక్కబడింది. ఇక్కడి గణేశుడు, సాధారణ గణేశుని విగ్రహాలకు భిన్నంగా కనిపిస్తాడు. పైన ఉన్న కుడి ఎడమ చేతులు కమలం మరియు గొడ్డలిని ధరించి ఉండగా దిగువన ఉన్న కుడి ఎడమ చేతులు జపమాల మరియు మోదకాలతో నిండిన పాత్రను చేబూని ఉంటాయి. పవిత్రమైన జంధ్యాన్ని జ్ఞప్తికి తెస్తూ, ఎడమ భుజంపై నుంచి ఉదరానికి కుడి వైపు దాకా వ్యాపించి ఉన్న సర్పము కనిపిస్తుంది. విఘ్నాధిపతి ఫాలభాగంపై ప్రతిష్ఠితమైన నేత్రం, పరమశివుని త్రినేత్రాన్ని దాదాపుగా పోలి ఉన్నది. విఘ్నేశ్వరుని విగ్రహానికి ఇరువైపుల కొలువై ఉన్న సిద్ధి మరియు బుద్ధి దేవతా విగ్రహాలు,
గణేశ విగ్రహం వెనుక నుంచి తొంగి చూస్తున్నట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇరువురు దేవతలతో గణపతి కొలువైన కారణంగా ఈ దేవాలయానికి సిద్ధివినాయక దేవాలయమనే పేరు సార్థకమయ్యింది. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ దేవతలు పవిత్రత, విజయం, అభివృద్ధి మరియు ఐశ్వర్యానికి నిదర్శనంగా నిలుస్తారు. సిద్ధి మరియు బుద్ధి దేవతలు విజయం, సంపద మరియు అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తారు. కుడివైపునకు తిరిగిన తొండాన్ని కలిగి ఉన్న పవిత్రమైన శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం ప్రత్యేకమైనది, అదెలాగంటే తొండం ఎడమవైపుకు తిరిగినట్లుగా ఉండే గణేశుని రూపం సర్వసాధారణమైనది కనుక. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పదిహేను రోజుల పాటు సంప్రదాయబద్ధమైన పూజలు అందుకున్న అనంతరం అద్భుతమైన శ్రీ సిద్ధివినాయకుని విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది.
హిందూ కాలమానాన్ని అనుసరించి, 1723వ శకం, "దుర్ముఖ్ సంవత్సరం"లో కార్తీక శుద్ధ చవితినాడు అనగా 1801వ సంవత్సరం నవంబర్ 19వ తేదీ గురువారం నాడు పాత దేవాలయం శుద్ధి చేయబడింది. 3.60మీ. x 3.60మీ. చదరపు విస్తీర్ణంలో దేవాలయం నిర్మితమయ్యింది. ఈ దేవాలయం అట్టడుగు అంతస్తు నిర్మాణమై వెలుగొందుతున్నది (చిత్రం సంఖ్య.1 చూడుడు). ఇది 450 మి.మీ.ల మందం కలిగిన ఇటుక గోడలు మరియు పురాతన రకపు గోపురం, మరలా ఎగువ భాగాన కలశంతో కూడిన ఇటుకను కలిగి ఉన్నది. గోపురానికి ఆవృతమైనట్లుగా, ఇనుపకమ్ముల చట్రంతో కూడిన పిట్టగోడ, దేవాలయ నిర్మాణంలో భాగమై ఉన్నది. దేవాలయం యొక్క భూమట్టం, రహదారి మట్టానికి సమానంగా ఉన్నది. ప్రభాదేవిలో అత్యధిక వాహన రద్దీని కలిగి ఉండే ప్రాంతమైన కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్ మరియు ఎస్.కె.బోలే మార్గ్లకు మూలగా ఈ దేవాలయం కొలువై ఉంది. మాతుంగ అగ్రి సమాజ్కు చెందిన ధనవంతురాలు శ్రీమతి దేవూబాయ్ పాటిల్ ఆర్థిక సహాయం మరియు ఆదేశాలను అనుసరించి
ప్రముఖ కాంట్రాక్టర్ స్వర్గీయ లక్ష్మణ్ విథుపాటిల్ దేవాలయాన్ని నిర్మించారు. ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ధనవంతురాలైనప్పటికీ దేవూబాయ్ పాటిల్ సంతానానికి నోచుకోలేదు. విఘ్నేశ్వరుని సేవించడానికి అంకితమైన భక్తురాలైన దేవూబాయ్, తనకు సంతాన భాగ్యం చేకూర్చిన యెడల నీకు దేవాలయం కట్టిస్తానని వినాయకునికి మొక్కుకున్నది. దురదృష్టవశాత్తూ శ్రీమతి దేవూబాయ్ భర్త కన్నుమూసారు. భక్తాగ్రేసురులలో ఒకరైన ఆమె, మనసా వాచా కర్మణా తన మొక్కు తీర్చుకునేందుకు ఆమె అంకితమయ్యింది. దేవాలయ నిర్మాణానికి కంకణబద్ధురాలయ్యింది దేవూబాయ్.
తన నివాసంలోని గోడకు వేలాడుతున్న లంబోదరుని చిత్రపటం స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించవలసిందిగా ఆమె శిల్పులను ఆదేశించింది. అయితే శిల్పకారులకు స్ఫూర్తిగా నిలిచిన చిత్రం ముంబైలోని వాల్కేశ్వర్కు చెందిన బన్గంగాలోని 500 సంవత్సరాల నాటి విగ్రహానిది. స్వర్గీయ దేవూబాయ్కు పూజా సమయంలో ఉండగా దేవాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన కలిగింది. ఆ సమయంలో ఆమె గణనాధుని ఈ విధంగా వేడుకుంది. "
నాకెలాగు సంతాన యోగం లేకుండా పోయింది, దేవాలయానికి వచ్చి నీకు ప్రార్థనలు జరిపే సంతానం లేని మహిళలకు దయచేసి సంతాన భాగ్యం ప్రసాదించు స్వామీ". దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే, స్వర్గీయ దేవూబాయ్ ప్రార్థనకు, నిస్వార్థమైన ఆమె ఆకాంక్షకు ఏకదంతుడు అంగీకరించినట్లు తోస్తున్నది. అందుకేనేమో, అప్పటి నుంచి, సిద్ధివినాయకుడు "నవసచ గణపతి" లేదా మరాఠీలో "నవసాల పవనర గణపతి" (మనసావాచా కర్మణా ప్రార్థించే వారికి వరములిచ్చే
గణపతి)గా భక్తులచే పిలువబడుతున్నాడు.చేరుకునే మార్గం: దేశానికి వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న ముంబై నగరానికి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా విమానం, రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చును.ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.వసతి ఏర్పాట్లు: దేవాలయ నిర్వాహక కమిటీకి చెందిన ఎటువంటి ధర్మశాల లేదా వసతి గృహం లేకపోయినప్పటికీ అన్ని తరగతుల ప్రజల ఆర్థిక స్తోమతకు అనుగుణంగా లభించే హోటళ్ళు, ధర్మశాలలు మరియు లాడ్జీలకు ముంబైలో కొదవ లేదు.