శ్రీవారి భక్తులను వెంటాడుతున్న గజరాజుల భయం!
శ్రీవారి భక్తులను ఏనుగుల భయం వెంటాడుతోంది. మైసూరులో గజరాజులు విధ్వంసం సృష్టించడంతో తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులు ఏనుగుల భయంతో వణికిపోతున్నారు. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు చేసిన శబ్ధానికి బెదిరి ఓ ఏనుగు మాడ వీధుల్లో పరుగులెత్తి బీభత్సం సృష్టించింది. ఆ పిల్ల ఏనుగును మావటి అదుపులోకి తీసుకోవడం ద్వారా భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయోనని భక్తులు భయపడుతున్నారు. ముఖ్యంగా శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు, వార్షిక ఉత్సవాల్లో ఎస్వీ డైరీ నుంచి ఏనుగులను తీసుకొస్తారు. ఈ ఏనుగులు శ్రీవారి వాహన ఊరేగింపుల్లో ముందు వెళ్తూ మాడ వీధుల్లో ప్రదక్షణలు చేస్తాయి. అలాంటి సమయంలో ఏనుగులు భక్తులు చేసే గోవింద నామ స్మరణతో పాటు మంగళవాయిద్యాల శబ్ధానికి బెదిరిపోయి విధ్వంసం సృష్టిస్తే పరిస్థితి ఏమిటని భక్తులు వాపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు ఏనుగుల వేగ నియంత్ర పరికరాన్ని అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. కానీ వేగ నియంత్రణ పరికరాలతో గజరాజుల ప్రాణానికి ముప్పు ఉందని విమర్శలు రావడంతో వాటిని ఉపయోగించడాన్ని నిలిపివేశారు.కాగా, పెద్ద ఆకారాలను కలిగిన గజరాజులు చిన్న శబ్ధాలకు భయపడతాయని, కుక్కలను చూసిన భయపడుతాయని మావటులు చెబుతున్నారు. అయితే తిరుమలలో గజరాజులు విజృంభిస్తే శ్రీవారి భక్తులు తప్పించుకునే అవకాశాలు తక్కువ. మాడ వీధుల్లో గజరాజులు విధ్వంసం సృష్టిస్తే గ్యాలరీల వల్ల భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైసూరు సంఘటనతో తిరుమలలో గజరాజులను చూస్తున్న భక్తులు ఆమడదూరంలో నిలబడుతున్నారు. ఇంకా ఆలయ ప్రదక్షణకు వెనుకంజ వేస్తున్నారు. అలాగే గజరాజులను నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.