శ్రీవారి దర్శనం క్రమబద్ధీకరణ-నెలరోజుల్లో చర్చావేదిక!: తితిదే
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనం క్రమబద్ధీకరణ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ 50వేల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించి, ఏడాది పొడవునా లఘు దర్శనం అమలు చేయాలని భావిస్తున్నట్లు టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తుల రద్దీ పెరగడంతోనే క్రమబద్ధీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. రోజుకు 50వేల మందిని మాత్రమే శ్రీవారికి దర్శనానికి అనుమతించడం, ఏడాది పూర్తిగా లఘు దర్శనం అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులుండవని ఈవో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద వసతి గృహాల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీవారి దర్శన క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో చర్చావేదిక ఏర్పాటు చేస్తామని ఈవో కృష్ణారావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తిరుమల జేఈఓగా శ్రీనివాస రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గనాయకమండపంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు తితిదే తెలిపింది.