రాష్ట్రవ్యాప్తంగా రేపే తితిదే ఐదో విడత కళ్యాణమస్తు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఐదో విడత కళ్యాణమస్తు కార్యక్రమం బుధవారం జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కళ్యాణమస్తులో.. వేలాది జంటలకు సామూహిక వివాహాలు జరుగనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. కళ్యాణమస్తును పురస్కరించుకుని వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, హిందూ వివాహ విశిష్టత తెలిపే పుస్తకం ఇప్పటికే టీటీడీ కళ్యాణమండపాలకు చేర్చారు. అలాగే వధూవరులకు వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేయడానికి జిల్లా రిజిస్ట్రార్లు తగిన ఏర్పాట్లు చేశారు. కళ్యాణమస్తులో వివాహం చేసుకున్న జంటలు, వారి తల్లిదండ్రులకు తిరుమల శ్రీవారి శీఘ్రదర్శనానికి పాసులు అందజేస్తారు. వీరు మూడు నెలల్లోపు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహిస్తోన్న ఈ కళ్యాణమస్తులో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. తితిదే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కళ్యాణమస్తు కార్యక్రమానికి తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇటీవల వరదలు ముంచెత్తిన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణాజిల్లాలో మాత్రం ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తితిదే వాయిదా వేసింది. వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు పడ్డాక ఈ అంశంపై తితిదే తగిన నిర్ణయం తీసుకుంటుంది.