కార్తీక సోమవారాల్లో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే..!?
శివప్రీతికరమైన కార్తీక సోమవారాల్లో భానోదయం ముందు లేచి స్నానాదికార్యక్రమాలు ముగించుకుని, పొడిబట్టలు ధరించుకుని మొదట దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించవలెను. ఈ విధంగా చేసే భక్తులు సిరిసంపదలు, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఈ కార్తీక సోమవారాల్లో వనభోజం చేయడం శుభప్రదం. కార్తీక సోమవారాల్లో మాత్రమే గాకుండా కార్తీక మాసంలో ఏ రోజైన ఉసిరిక చెట్టుకింద భోజనం చేయడం మంచిది. శివుడిని అర్చించి అనంతరం అన్నదానము నిర్వహించి, అతిథి సత్కారాల తర్వాత దీక్ష వహించిన వ్యక్తి భుజించవలెను. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వపాపములు నశిస్తాయని నమ్మకం. ఇంకా కార్తీక మాసంలో వనభోజనానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు విష్ణువును కస్తూరి, గంధం, పంచామృతకాలతో అభిషేకించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. సంధ్యాసమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానం చేసినా అనంత పుణ్యఫలం లభిస్తుంది. గోధుమ పిండి లేదా బియ్యపు పిండితో ప్రమిదెను చేసి మంచి పత్తితో వత్తిని చేసి, ఆవు నెయ్యిలో వత్తిని తడిపి వెలిగించాలి. అలా మాసమంతా చేసి చివరి రోజున ఒక పండితుడిని పిలిచి వెండి ప్రమిదెను, భమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి దానం చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజిస్తే మోక్షప్రదమని, విష్ణువుకు మల్లెపూలతో పూజలర్పించడం వల్ల పాపాలు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.