కన్నుల పండుగగా భద్రాది రాముడి పుష్కర పట్టాభిషేకం!
భద్రాది రాముడి పుష్కర పట్టాభిషేకం వైభవంగా జరుగుతోంది. పుష్కర పట్టాభిషేకంలోని కీలక ఘట్టమైన కిరీట ధారణ వేడుకను వేలాది మంది భక్తులు కనులారా వీక్షించి తరించారు. సర్వాలంకరణాభూషితుడైన సీతాదేవి, లక్ష్మణ సమేతుడైన శ్రీరామునికి కిరీటాన్ని ఆగమశాస్త్రం ప్రకారం అలంకరించారు. శ్రీరామచంద్రుని పుష్కర పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రగిరి భక్త సంద్రంతో పోటెత్తింది. పట్టాభిషేక సందర్భంగా శ్రీరామునికి ఓంకారముతో కూడిన రాజముద్రిక, శ్రీ పాదములను పురోహితులు అలంకరించారు. బుధవారం శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మహోత్సవం భద్రాచలం ఆలయంలోని మిధిలా కల్యాణ మండపం ప్రాంగణంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ పుష్కర పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు హాజరై, సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో వేద పండితులు మహా పుర్ణాహుతి నిర్వహించారు. ఇంకా మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోలాటం ఆడారు.