ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అవుతుందా..?!!
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేసి తీరుతానని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ డి. ఆదికేశవులు నాయుడు ప్రకటించారు. అయితే తిరుమలేశుని ఆలయ గోడలకు పూర్తిగా బంగారుమయం చేయడం వల్ల ఆలయ సౌందర్యం దెబ్బతింటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక పంపారు. బంగారు తాపడం చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులను ఆయన ఏకరువు పెట్టారు. ఇదిలావుండగానే జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం ఆలయాన్ని స్వర్ణమయం చేయడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేయడంపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొందరు ఆగమశాస్త్రవేత్తలు ఆలయాన్ని బంగారుతో తాపడం చేయడం వల్ల ఎటువంటి సమస్య లేదంటున్నారు. మరికొందరు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీధుల్లో రతనాలను అమ్మిన శ్రీకృష్ణ దేవరాయలు అంతటివారే గోపురానికి తప్పించి గోడలను స్వర్ణమయం చేయలేదన్నారు. శ్రీవారి ఆలయం గోడలపై చరిత్ర సాక్ష్యాలుగా నిలిచే శాసనాలు ఉన్నాయనీ, స్వర్ణమయం చేయడం వల్ల వాటికి నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను మాత్రం శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేస్తానని ఆదికేశవులు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన పదవీకాలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉన్నది. ఈ నేపధ్యంలో ఆయన తన మాటను ఎలా నెరవేర్చుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది.