అడ్డదారిలో వచ్చారు.. అందుకే ఓడారు..!: తితిదే
ఇండియన్ ప్రీమియర్ లీగో మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ కారణం చెప్పారు. అదేమిటంటే..? కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ముంబై ఇండియన్స్ సభ్యులు, యజమానులు తిరుమలకు అడ్డదారిలో వచ్చారని తితిదే అధికారులు అంటున్నారు. అడ్డదారిలో తిరుమలకు చేరుకోవడం ద్వారానే ముంబై ఇండియన్స్ ఫైనల్లో ఓడిపోయిందని తితిదే ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన సచిన్ టెండూల్కర్ సేన, ఐపీఎల్-3 టైటిల్ గెల్చుకోవాలని ఆశిస్తూ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంది. త్వరితగతిన వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు అడ్డదారిన చేరుకున్నారని, అందుకే ఫైనల్ పోరులో ఓడిపోయారని తితిదే అధికారులు అంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో అజేయంగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్ పోరులో అనూహ్యంగా ఓడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్, బ్యాటింగ్ మెరుగ్గాలేకపోవడమే ఓటమికి కారణమని సచిన్ టెండూల్కర్ వివరణ ఇచ్చినా.. అభిమానులు ముంబై ఇండియన్స్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్ పోరులోనూ సచిన్ సేన నెగ్గుతుందని ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.కానీ.. తిరుమలకు అడ్డదారిలో చేరుకోవడమే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమని తితిదే అధికారులు చెబుతున్నారు. మరి ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే విషయంపై మీ అభిప్రాయమేమిటో? తెలియజేయండి.