Publish Date: Sat, 03 Aug 2019 (21:00 IST)
Updated Date: Sat, 03 Aug 2019 (21:03 IST)
పంచ భూతాల నిలయం ఈ విశాల విశ్వం. భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలో వెలసిన వాయులింగం. అందుకే ఇక్కడ గాలిని స్మరించిన తరువాత ఇతర ఏ దేవాలయాలకు వెళ్ళకూడదని ఆచారం ఉంది.
సర్పదోష, రాహుకేతు పూజలు చేయించుకుంటే సమస్యలు తీరిపోతాయి. శ్రీకాళహస్తిలోని సుబ్రహణ్యస్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తిలో చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే వెళ్ళాలని చెబుతుంటారు పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఈ దేవాలయానికి వెళ్ళినా ఆ దోషనివారణ జరగదని పూజారులు చెబుతుంటారు.
గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని, మిగిలిన అన్ని దేవుళ్ళకు శని, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. తిరుమలలో సహా అన్ని దేవాలయాలను గ్రహణ సమయంలో మూసేస్తారు. గ్రహణం తరువాత సంప్రోక్షణ జరిపి ఆ తరువాత ఆలయాలను తెరుస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసివేయరు. అందుకే శ్రీకాళహస్తి ఆలయ దర్శనం తరువాత వేరే ఇతర ఏ ఆలయాలకు వెళ్ళకూడదట.