తల్లి బిడ్డను పూజించడం ఏమిటి...? కానీ గణపతిని పార్వతి పూజించింది.. ఎందుకు? ఎక్కడ?
పార్వతీ దేవి వినాయకుడికి తల్లి. అలాంటిది పార్వతీ దేవి స్వయానా తన కుమారుడిని పూజించింది. తల్లి బిడ్డను పూజించడం ఏమిటి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పురాణాలు ఇదే చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీ దేవి శివుడిని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది.
Publish Date: Wed, 26 Apr 2017 (18:40 IST)
Updated Date: Wed, 26 Apr 2017 (18:42 IST)
పార్వతీ దేవి వినాయకుడికి తల్లి. అలాంటిది పార్వతీ దేవి స్వయానా తన కుమారుడిని పూజించింది. తల్లి బిడ్డను పూజించడం ఏమిటి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పురాణాలు ఇదే చెప్తున్నాయి. ఒకనాడు పార్వతీ దేవి శివుడిని పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీ దేవికి ఆ మంత్రాన్ని ఉపదేశించి, ఆ మంత్రాన్ని జపం చేయడానికి కొంత కాలవ్యవధిని పెట్టి, అంతకాలం పాటు మాట్లాడకూడదని కూడా చెప్పాడు.
కానీ పార్వతీ దేవి ఆ విషయాన్ని మాలిని అనే చెలికత్తెకు చెప్పింది. వెంటనే పరమశివుడికి ఆ విషయం తెలిసి, జనన మరణములు ఉండే మనుష్య రూపం పొంది మళ్లీ పంచాక్షరీ మంత్రాన్ని చాలా కాలం పాటు జపం చేస్తే తప్ప నా పక్కన కూర్చునే అధికారం లేదని చెప్తాడు.
అప్పుడు పార్వతీ దేవి కైలాసం నుండి బయల్దేరి ఇప్పుడు శ్రీకాళహస్తి అని పిలవబడే ప్రదేశానికి చేరుకుని అక్కడే తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తపస్సుకు ఆటంకాలేవీ కలగకుండా ఉండటానికి పార్వతీ దేవి తన కుమారుడైన విఘ్నేశ్వరునికి మొదటిసారిగా పూజ చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి శివుడు, పార్వతీ దేవి తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహించి మళ్లీ ఆయన పక్కన స్థానం కల్పించాడు.
పార్వతీ దేవి పూజించిన కారణంగా అక్కడ ఉండే గణపతిని పుష్టి గణపతి అనే పేరుతో పశ్చిమ దిక్కులో వెలసి ఉండమని, ఆ పుష్టి గణపతిని ఎవరు పూజ చేసినా కూడా వారికి విఘ్నాలు లేకుండా వారు అనుకున్నది సాధించేలా వారికి శక్తిని ఇవ్వమని చెప్పింది.
ఇప్పటికీ శ్రీకాళహస్తిలో పుష్టి గణపతి పేరుతో వినాయకుడిని దర్శించుకోవచ్చు. పార్వతీ దేవి పూజించిన గణపతి ఆలయం భారతదేశంలోనే కేవలం ఒక్కటే ఉండటం, అది కూడా మన తెలుగు నేలపై ఉండటం విశేషం.