Publish Date: Thu, 06 Aug 2020 (22:10 IST)
Updated Date: Thu, 05 Nov 2020 (18:06 IST)
బుద్ధిమంతుడుగా వున్న వరునికే కన్యను ఇవ్వాలని శాస్త్రాలు చెపుతున్నాయి. పెళ్లయ్యేవరకూ అతడు బ్రహ్మచర్యాన్ని పాటించినవాడై వుండాలి. సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా వుండాలి. వివాహ వయస్సు దాటినవారికి కన్యనివ్వడంలో సందేహాలున్నప్పటికీ మంచి లక్షణములున్నట్లయితే అమ్మాయిని ఇవ్వవచ్చు. వరునికి విద్య, బలము, ఆరోగ్యము, అంగబలము అనేవి వుండాల్సినవి.
వధువుకి స్త్రీత్వమెట్లాగో అట్లే పుంస్త్వము కూడా పురుషులకు ముఖ్యమైనది. బీజ రహిత పురుషులు క్షేత్రమును పొందేందుకు అనర్హులు. అందుకే అతడి యొక్క అవయవముల లక్షణములను బట్టి పురుషత్వము పరీక్షించిన తర్వాత కన్యను ఇవ్వాలని చెప్పబడింది. నపుంసకులు 14 రకాల తరగతులుగా వుంటారనీ, వారికి పిల్లనియ్యరాదని నారద మహర్షి చెప్పాడు.
భార్య చనిపోయిన వానికి కన్యను ఇవ్వడం కంటే అసలు వివాహం చేసుకోని వానికి ఇవ్వడం శ్రేష్టం. వివాహం కాకుండా బ్రహ్మచారిగా వున్న పురుషుడికి కన్యాదానము చేయడం వల్ల అనంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. రెండవ వివాహానికి సిద్ధంగా వున్నవాడికి ఇచ్చినట్లయితే సగం ఫలం వస్తుంది. పలు పర్యాయాలు వివాహం చేసుకున్నవాడికిచ్చిన నిష్ఫలం.
అంతేకాదు... మిత్రులచే, కులముచే విడువబడినవాడు, పతితుడు, అసవర్ణుడు, పక్షపాతరోగి, రహస్య వేషంలో వుండేవాడు, బాన కడుపు కలవాడు, సగోత్రుడు కన్యనిచ్చేందుకు పనికిరాడు. అటువంటి వారితో అమ్మాయికి పెళ్లయినట్లతే త్వరలో ఆ వధువు తిరిగి పుట్టింటికి వచ్చేస్తుందని వసిష్ఠులవారు చెప్పియున్నారు. అంతేకాదు మరీ దగ్గరగా వున్నవాడికి, మరీ దూరంగా వున్నవాడికీ, అతి బలవంతుడైన వాడికి, బలహీనమైనవాడికి, జీవికకు సాధనం లేనివాడికి, మంద బుద్ధికీ కన్యను ఇవ్వరాదని చెప్పబడింది.