టిటిడి ఛైర్మన్కు ఏమైంది...? ఎందుకలా మాట్లాడారు...?!
తిరుపతిలో టిటిడి ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను స్వామివారి నాలుగు మాడ వీధుల్లో కాకుండా రింగురోడ్డులో నిర్వహించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతానని టిటిడి ఛైర్మన్
తిరుపతిలో టిటిడి ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను స్వామివారి నాలుగు మాడ వీధుల్లో కాకుండా రింగురోడ్డులో నిర్వహించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతానని టిటిడి ఛైర్మన్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆగమ శాస్త్రాలను పక్కనబెట్టి స్వామివారి వాహన సేవను రింగ్ రోడ్డులో నిర్వహిస్తారా అని పండితులు ప్రశ్నిస్తున్నారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ముగిశాయి. అయితే బ్రహ్మోత్సవాల సక్సెస్ మీట్ను తిరుపతిలో ఏర్పాటు చేశారు టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి. సమావేశంలో నోరు జారారాయన. అది కూడా ఏకంగా స్వామివారికి నిర్వహించే వాహన సేవలో మార్పు తీసుకురావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారికి అత్యంత ఇష్టమైన గరుడ వాహనసేవకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారని అయితే వారిని నిలువరించడం మా వల్ల సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు టిటిడి ఛైర్మన్.
ఒక్కసారిగా ఇంతమంది జనం ఉండటం వల్ల తోపులాటలు జరిగాయని, వచ్చే సంవత్సరం నుంచి నాలుగు మాడ వీధుల్లో కాకుండా రింగు రోడ్డులో కూడా నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. టిటిడి ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలకు మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆగమ శాస్త్రాలను కాదని వాహన సేవను రింగురోడ్డులో నిర్వహించడం ఏమిటో అర్థం కాక మీడియా ప్రతినిధులు ముక్కున వేలేసుకున్నారు. చదలవాడ అంతటితో ఆగకుండా రింగ్రోడ్డులో వాహన సేవను వూరేగించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పుకొచ్చారు.
టిటిడి ఛైర్మన్ చెప్పిన విధంగా చేయడం ఏమాత్రం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని తెలిసి టిటిడి ఛైర్మన్ ఈ విధంగా మాట్లాడటంపై కొంతమంది పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఛైర్మన్ ఎందుకిలా మాట్లాడారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.