Publish Date: Wed, 04 May 2022 (21:32 IST)
Updated Date: Wed, 04 May 2022 (21:35 IST)
పూర్వం రామశర్మ-కాత్యాయని అనే దంపతులు నిత్యం పూజలు చేసుకుంటూ వుండేవారు. విద్యార్థులకు వేదాలు చెపుతూ వుండేవారు రామశర్మ. పరమేశ్వరుని అనుగ్రహంతో వారికి ఓ కుమారుడు కలిగాడు. అతడి పేరు సుమంతుడు అని పెట్టారు. ఐతే రామశర్మ చదవు చెప్పే విద్యార్థులంతా ఉన్నతస్థాయికి వెళితే... కుమారుడు సుమంతుడు మాత్రం పనికిరానివాడిగా తయారయ్యాడు.
ఓ రోజు రామశర్మ తన కుమారుడిని పిలిచి మంచిమాటలు చెప్పి అతడిని దారిలో పెట్టాలని చూసాడు. కానీ అతడికి అది సాధ్యం కాలేదు. చివరికి కొడుకు మెడలో రుద్రాక్ష మాల వేసి, ఆ మాలను ఎన్నటికీ తొలగించవద్దని చెప్పాడు. కొంతకాలానికి రామశర్మ కాలం చేసాడు. అనంతరం కాత్యాయని కూడా కన్నుమూసింది.
చదువు అబ్బక, సంపాదన లేక సుమంతుడు దొంగగా మారాడు. ఓరోజు ఓ ఇంటిలో దొంగతనం చేసేందుకు అర్థరాత్రి వేళ వెళ్లగా ఇంట్లో వారు అతడిని గమనించి.. దొంగ--- దొంగ అంటూ కేకలు వేసారు. దీనితో భటులు అతడిని వెంబడించారు. సుమంతుడు తిరిగి వారిపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించాడు. భటుల్లో ఒకడు తీవ్ర కోపంతో సుమంతుని పైకి శూలము విసిరాడు. అది సుమంతుడి గుండెల్లో దిగబడి ప్రాణాలు కోల్పోయాడు.
అంతట అతడిని యమలోకానికి తీసుకుని వెళ్లేందుకు యమదూతలు వచ్చారు. ఐతే వారిని శివదూతలు అడ్డుకున్నారు. దీనితో స్వయంగా యముడే ప్రత్యక్షమై సుమంతుడిని యమలోకానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమై... ఎంతటి దుర్మార్గుడైనా మరణించు సమయంలో రుద్రాక్ష మాల ధరిస్తే అతడికి తప్పక శివసాయుజ్యము లభిస్తుందని చెప్పాడు. దీనితో యముడు తిరిగి వెళ్లిపోగా శివదూతలు సుమంతుని తోడ్కొని వెళ్లారు. కనుక శివమాల ధరించిన ఎంతటి శక్తివంతమైనదో దీనిద్వారా తెలుస్తుంది.