మల్లన్నకు టివీ వస్తోంది.. మరి శివయ్యకు....
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవస్థానం సొంతంగా టీవీ ఛానల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్వయంగా రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ప్రకటించారు. ఇది చాలా ఆసక్తి కలిగిస్తున్న వార్త. రాష్ట్రంలో తితిదేకి తప్ప ఏ ఇతర ఆలయాలకు సొంత టీవీ ఛానళ్లు లేవు. ఆ మా
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవస్థానం సొంతంగా టీవీ ఛానల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్వయంగా రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ప్రకటించారు. ఇది చాలా ఆసక్తి కలిగిస్తున్న వార్త. రాష్ట్రంలో తితిదేకి తప్ప ఏ ఇతర ఆలయాలకు సొంత టీవీ ఛానళ్లు లేవు. ఆ మాటకొస్తే దేశంలోనే సొంత టీవీ ఛానళ్లు కలిగిన దేవాలయాలు లేవు. కేరళలోని అయ్యప్పస్వామి దేవస్థానానికి కూడా ఛానల్ లేదు. న్యూస్ ఛానళ్లకు అనుబంధంగా ఆధ్మాత్మిక ఛానళ్లను నిర్వహిస్తున్న ప్రైవేటు వ్యక్తులను పక్కనబెడితే కొన్ని మఠాలు, స్వామీజీలు మాత్రం ఇటీవల కాలంలో సొంతంగా టీవీ ఛానళ్ళు ప్రారంభించారు. శంకర టీవి, భారత్ టుడే వంటి టివిలు ఇందులో ఉన్నాయి.
రాష్ట్రంలో తితిదే తరువాత అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, కాణిపాకం ఆలయాలున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలు 100 కోట్ల వార్షిక ఆదాయం దిశగా పరుగులు తీస్తున్నాయి. ఈ ఆలయాలను సందర్సించే భక్తుల సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాళహస్తి ఆలయానికైతే రోజూ 20 వేల మందికిపైగా భక్తులు వస్తున్నారు. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పూజల కోసమే రోజూ ఐదారు వేలమంది వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆదాయం రీత్యా చూసినా భక్తుల సంఖ్య రీత్యా చూసినా శ్రీశైలంతో సమానంగా శ్రీకాళహస్తి ఆలయం విస్తరిస్తోంది. శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింతగా అభివృద్థి చేయాలని ప్రభుత్వమూ భావిస్తోంది. ఇందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక టీవీ ఛానల్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దేవాలయానికి ఛానల్ అంటే బాగుంటుందన్న ఆలోచన రావడం సహజమే. అయితే ఇందులోని సాధ్యాసాధ్యాలు అవసరాలు - ఆవశ్యకత ఏమిటన్నది పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. శ్రీశైలం దేవస్థానం టీవీ ఛానల్ కోసం ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు గానీ ఇందులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. టీవీ ఛానల్ నడపడమంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తితిదే ఎస్వీబీసీ ఛానల్కు ఏటా 15కోట్ల దాకా ఖర్చవుతోంది. గతంలో ఏటా 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సందర్బాలున్నాయి. ఛానల్ పెట్టడం కాదు అన్ని చోట్లా ప్రసారాలు అందేలా చూడటం పెద్ద సమస్య. కేబుల్ ఆపరేటర్లకు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తితిదేకి ఉన్న ప్రతిష్ట రీత్యా కేబుల్ ఆపరేటర్లు ఎస్వీబీసీని ఉచితంగా ప్రసారం చేయవచ్చుగానీ మిగిలిన దేవాలయాలు పెట్టే ఛానళ్లనుప్రసాదం చేస్తాయని చెప్పలేం.
ఎస్వీబీసీ స్థాయిలో యేటా 15కోట్లు కాకున్నా అందులో సగమన్నా ఖర్చవుతుంది. ఇంత మొత్తం వెచ్చించి టీవీ ఛానల్ ఏర్పాటు చేయాలా? అనే ప్రశ్న. అవసరమైతే శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ దేవాలయాలన్నీ కలిపి ఒక ఆధ్మాత్మిక ఛానల్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను ప్రసారం చేయడం, భక్తులకు అవసరమైన సమాచారం అందించడం ఈ ఛానల్ సరిపోతుంది. ఆ మాటకొస్తే ప్రైవేటు ఛానళ్ళు కూడా దేవాలయాల సమాచారాన్ని విస్తృతంగానే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఆలయానికి ప్రత్యేక ఛానల్ అవసరం లేదని చెబుతున్నారు. టీవీ ఛానల్కు అయ్యే ఖర్చుతో విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు సేవలందించగలిగితే జనం హిందూ మతానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయి.