Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివుని సంపదను మింగిన దొంగలు ఆనాటి నుంచే ఉన్నారు..!

చిత్తూరు జిల్లా పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఆలయాలను గతంలో అభివృద్ధి చేయడంతో పాటు అదే స్థాయిలో కొంతమంది ఆలయాల సంపదలను దిగమింగారు కూడా. ప్

శివుని సంపదను మింగిన దొంగలు ఆనాటి నుంచే ఉన్నారు..!
, గురువారం, 8 డిశెంబరు 2016 (13:10 IST)
చిత్తూరు జిల్లా పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఆలయాలను గతంలో అభివృద్ధి చేయడంతో పాటు అదే స్థాయిలో కొంతమంది ఆలయాల సంపదలను దిగమింగారు కూడా. ప్రధానంగా శివాలయాల్లో అయితే చెప్పలేనంత అవినీతి. చిత్తూరు జిల్లా యోగిమల్లవరం సమీపంలోని పరాశరేశ్వర స్వామి ఆలయంలో జరిగిన స్వాహా అంతా ఇంతా కాదు. 
 
దేవుడన్న భయం కూడా లేకుండా స్వామివారి సంపదను మింగేసే ఘనులు ఈనాడే కాదు. ఆనాడూ ఉన్నారు. శ్రీవారి ఆలయంలో దీపారాధన కోసం ఇచ్చిన బంగారాన్ని స్వాహా చేసిన వారి నుంచి ఉదంతం రాజుల కాలంలోనే జరిగింది. ఆ స్వాహారాయుళ్ళపై విచారణ జరిపించి.. ఆ బంగారాన్ని స్వామి ఖజానాకు జమ చేశారు. ఇలాంటివి ఒకటి రెండు ఉదంతాలు శాసనాల్లో కనిపించాయి. 
 
ఇది చోళ రాజుల కాలం నాటి ఉదంతం. అంటే సుమారు వెయ్యి సంవత్సరాల ముందు నాటి ఘటన. అప్పుడు తిరుపతి నగరం ఇంకా ఏర్పడలేదు. తిరుచానూరు, తిరుమండ్యం గ్రామాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి తిరుమండ్యం పాలనాధికారికి దాతల నుంచి 23 పాన్‌ బంగారు నాణేలు విరాళంగా అందాయి. శ్రీవారి ఆలయంలో రోజూ 24 నెయ్యి దీపాలు వెలిగించే ఒప్పందంతో ఈ బంగారు నాణేలు అందజేశారు దాతలు. అయితే తిరుమండ్యం గ్రామాధికారి శ్రీవారి ఆలయంలో 24దీపాలకు బదులు 2 దీపాలు మాత్రమే వెలిగిస్తూ వచ్చారట.
 
ఆ రోజుల్లో ఆలయాలను పర్యవేక్షించడానికి అరుళక్కిం అనే పదవి ఉండేది. ఆయన ఆలయాల్లో పూజలు, నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసేవారు. మొదటి రాజేంద్ర చోళ దేవుడు పాలనలో ఉండగా అరుళక్కిం అధికారి ఒకరు తిరుచానూరుకు వచ్చారు. అక్కడే విడిది చేశారు. అప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే దీపారాధన గురించి చర్చిస్తుండగా అర్చకులు ఓ ఫిర్యాదు చేశారు. తిరుమండ్యం పాలనాధికారి మోసాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. అంతే తిరుమండ్యం గ్రామాధిపతిని పిలిచి వివరించారు. ఆయన చేసిన తప్పును మందలించారు. అంతేగాక అతని నుంచి 23 పాన్‌ బంగారాన్ని వసూలు చేసి శ్రీవారి ఖజానాకు జమ చేయించారట. అప్పటినుంచి ఆలయంలో 24 దీపాలు వెలిగించే బాధ్యతను ఆలయ అధికారులకు అప్పజెప్పారట.
 
ఇది క్రీ.శ.1235 నాటి ఉదంతం. మూడో రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో జరిగింది. తిరుచానూరుకు సమీపంలోని యోగిమల్లవరంలో వెలసిన శ్రీ తిప్పలాధీశ్వర అనే పరాశరేశ్వర దేవాలయం ఉంది. ఆ ఆలయంలో నిత్యం అభిషేకం, అన్నప్రసాద నైవేథ్యం చేయడాన్ని జయిన్‌ కొండ బ్రహ్మమారయన్‌ అనే దాత 26 1/4 కొలంజుల స్వచ్ఛమైన బంగారం తిరుచానూరు స్థానత్తారులకు ఇచ్చారు. ఈ మేరకు శిలాశాసనం రాయించారు. అయితే బంగారు తీసుకున్నవారు పరాశరేశ్వరునికి పూజలు, నైవేథ్యాలు చేయించలేదు. ఇది వీర నరసింగ యాదవ రాయలు దృష్టికి వెళ్ళింది. తిరుచానూరు స్థానిత్తారులను న్యాయ విచారణకు పిలిపించారు. 
 
అయితే తమకు ఏ విషయమూ తెలియదని వారు బుకాయించారు. అర్చకులు శిలాశాసనాలనే ఆధారంగా, సాక్ష్యంగా చూపించారు. ఆలయంలో ఊడిగం చేసే వారినీ రాజు విచారించారు. వారు కూడా శిలాశాసనంలోని సమాచారం వాస్తవమేనని చెప్పారు. దీంతో రాజు తిరుచానూరు స్థానత్తారుల నుంచి 26 1/4 కొలంజుల బంగారాన్ని వసూలు చేసి పరాశరేశ్వర స్వామి బాండాగారానికి స్వాధీనపరిచారట. ఇది మన ప్రాంతంలోని రెండు చోట్ల జరిగిన ఉదంతాలు. ఇక దేశ వ్యాప్తంగా ఎంత మంది ఆలయాల సొమ్ము దిగమింగారో..! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో 2,200 యేళ్ళ నాటి పురాతన ఆలయం!