శంఖం అనే పదం శం+ఖం అనే రెండు అక్షరాలు కలిపితే ఏర్పడ్డ పదం. 'శం'కు 'శుభం' అను అర్ధం ఉంది. 'శం' అన్నది సమస్త ఫలదాయకమైన బీజాక్షరం. 'ఖం' అన్న అక్షరానికి 'జల్లు', 'స్థలం' అనే అర్ధాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అర్థం శుభం కలిగించే స్థలం లేదా శుభం కలిగించే నీరు (జల్లు) ఉన్న స్థలం అని చెప్పుకోవచ్చు. శంఖంలో నీరు పోసి తీర్థంగా తీసుకునే ఆచారం హిందూ మతంలో ఉంది. అందుకే 'శంఖంలో నీరు పోస్తే గాని తీర్ధం అవ్వదు' అనే నానుడి వచ్చింది. శంఖాన్ని ఉచ్చరించిన ప్రతీసారీ "శం" ఉచ్చరించబడడంతో సమస్త శుభ ఫలాలు కలుగుతాయి.
శంఖం యొక్క ఆవిర్భావం:
శంఖం ఎలా పుట్టిందనడానికి బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ చెప్తారు. పూర్వ కాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణకవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తగా స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించగా, విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ రహస్యం పొందాడు. ఆ రహస్యాన్ని ఛేదించిన తరువాత శివుడు ఆ శంఖచూడుడిని సంహరించి సముద్రంలో పడేలా చేస్తాడు. అంతట శంఖచూడుడిని సతీమణి తన పాతివ్రత్య మహిమతో శంఖంగా మారుస్తుంది. క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన పదునాలుగు సంపదలలో శంఖం కూడా ఉంది.విష్ణు పురాణంలో శంఖాన్ని శ్రీమహాలక్ష్మీకి సోదరిగా అభివర్ణించింది. శ్రీమహాలక్ష్మి, శంఖం సముద్రుని సంతానముగా వివరించబడింది.
ప్రాధాన్యత:
సనాతన సాంప్రదాయంలో శంఖం యొక్క ప్రాధాన్యత ఈక్రింది శ్లోకాలతో స్పష్టం అవుతుంది.
"శంఖం చంద్రార్క దైవం మధ్యే వరుణ దైవతమ్
పృష్ఠే ప్రజాపతి విద్యాత్ అగ్రే గంగ్గా సరస్వతీ
శంఖం చంద్ర-అర్క దైవతం మధ్యే వరున్న దైవతం
పృష్ఠే ప్రజాపతి విద్యాత్ అగ్రే గంగా సరస్వతీ"
అనగా...
శంఖంలో చంద్ర(చంద్రుడు), అర్క (సూర్యుడు) దేవతలు ఉంటారు, దాని మధ్యలో వరుణ దేవుడు, దాని వెనుక భాగంలో ప్రజాపతి మరియు దాని ముందు గంగా మరియు సరస్వతి ఉంటారు అని తెలుసుకోవాలి ( అనగా శంఖాన్ని ఈవిధంగా చూడాలి),
"త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య చ ఆజ్ఞాయ
శంఖే తిష్ఠన్తి విప్రేన్ద్ర తస్మాచ్ఛంఖం ప్రపూజయేత్"
అనగా ...
వాసుదేవుని ఆజ్ఞతో మూడు లోకాలలో ఏ తీర్థాలు (తీర్థయాత్రల పవిత్ర జలాలు) ఉన్నాయో, అవి శంఖం (శంఖం) లోపల ఉంటాయి, ఓ శ్రేష్ఠమైన జ్ఞానులారా; అందువల్ల శంఖాన్ని పూజించాలి.
శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో, యజ్ఞాలలో, రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశ పూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల అభివృద్ధికలుగుతుందని పూర్వీకులు విశ్వసించారు. మందిరాలలోను, శుభకార్యాలలోనూ దీని ధ్వని పవిత్రతను, శోభను పెంచుతుందని భావించబడింది. శంఖాన్ని పూజించడం ద్వారా అదృష్టం కలుగుతుందని హిందూ మత విశ్వాసం. శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు.
"శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి" అని పూజిస్తారు.
శంఖం యొక్క రకాలు:
శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని 3 రకాలుగా విభజిస్తారు.
1. దక్షిణావృత శంఖం- పూజకు మాత్రమే ఉపయోగిస్తారు.
2. వామవర్తి శంఖం- ఊదుటకు మాత్రమే ఉపయోగిస్తారు.
3. మధ్యావృత శంఖం- కుడిచేతితో పట్టుకునే శంఖము.
కొన్ని ముఖ్యమైనశంఖాలు :
1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.
మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి:
శ్రీకృష్ణుడు - పాంచజన్యం
అర్జునుడు - దేవదత్తం,
భీముడు - పౌంఢ్రకం
యుధిష్ఠరుడు - అనంత విజయ
నకులుడు - సుఘోష
సహదేవుడు - మణిపుష్పక
కాశీరాజు - శిఖండి
దృష్టద్యుమ్నుడు, విరాటుడు – స్వాతిక
శంఖగాయత్రి:
సముద్ర తనయాయ విద్మహే
శంఖరాజాయ ధీమహీ
తన్నో శంఖ ప్రచోదయాత్
శంఖాన్ని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుయొక్క పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు, దౌర్భాగ్యం దూరమవుతాయి అంటారు.
విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు.
గణేష్ శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. శంఖం యొక్కశబ్దం దుష్ట శక్తులను తొలగిస్తుందని, మంచి శక్తులను ఆహ్వానిస్తుందని నమ్ముతారు.
చిన్న శంఖ మాలలను ధరించి పూజించడం ద్వారా సిద్ధులను కైవసం అవుతాయని నమ్ముతారు. శక్తి పూజలలో చిన్న శంఖాలు మాల ఉపయేగిఃచడం వలన అనుగ్రహ ప్రాప్తి శీఘ్రమవుతుందని భావిస్తారు.
ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించేటప్పుడు శంఖాన్ని ఊదడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తి అవుతుంది.
ప్రతిరోజూ పూజలో శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంటిలోని ప్రతికూల శక్తి అంతా పోయి, అక్కడ ఎల్లప్పుడూ సుఖసంతోషాలు నెలకొంటాయి.
శంఖాన్ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలాంటి ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని నమ్ముతారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
శంఖం ఊదడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. శంఖం ఊదడం వల్ల కడుపు కండరాలు బలంగా మారుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (Asthma, COPD) ఉన్నవారికి ఇది మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. శంఖం ఊదడం వల్ల లోతైన శ్వాస తీసుకుంటాం, ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శంఖం నీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
మానసిక ప్రయోజనాలు:
శంఖం ఊదడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం, సౌండ్ థెరపీ లాంటివి చేసేవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. శంఖం శబ్దం మనస్సును ప్రశాంతపరుస్తుంది, ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది.
చర్మ సంబంధిత ప్రయోజనాలు:
శంఖం నీటితో స్కిన్ మసాజ్ చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇతర ప్రయోజనాలు:
శంఖం నీటిని తాగడం వల్ల బీపీ, షుగర్, జీర్ణక్రియ, ముక్కు, చెవుల సమస్యలు నయమవుతాయి. ఆద్యాత్మికంగా, వాస్తుశాస్త్ర పరంగా, ఆరోగ్యపరంగా శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.