Publish Date: Tue, 12 Jul 2022 (19:11 IST)
Updated Date: Tue, 12 Jul 2022 (19:15 IST)
ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాసపూర్ణిమ జరుపుకుంటారు. ఆ రోజు
"సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం.." అంటూ గురు పరంపరను స్మరించుకోవాలి. బ్రహ్మ విద్యాసారం, మహాభారతం, అష్టాదశ పురాణాలు ఇలా సకల వేద సారాన్ని మనకు అందించారు. వ్యాసుల అగ్రగురువు. భగవంతుడికీ భక్తుడికీ మధ్య సంధానకర్త గురువు.
"నారాయణ నమస్మృత్వ నరంచైవ నరోత్తమం దేవీఎం
సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్"
అంటే నారాయణునికి, నరశ్రేష్ఠునికి, సరస్వతీ దేవికి, వేదవ్యాసునికి నమస్కరించాలని దీని భావం. విష్ణు సహస్రనామ సంకీర్తనలో "వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే.."అన్నారు. దీనిని బట్టి విష్ణు స్వరూపుడే వ్యాసులవారు అంటారు.
గురువులను పూజిస్తే సర్వదేవతలనూ పూజించినట్టే. వ్యాసపూర్ణిమ నాడు గురువులను పూజించడం వెనుక బ్రహ్మాండపురాణంలో ఓ కథనం వుంది.
పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులు వుండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వేదవ్యాసుని ప్రసన్నం చేసుకుని.. తమకు ఆ భాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటాడు. వారికి సంతానం కలుగుతుందని వ్యాసుల వారు ఆశీర్వదించారు.
అలాగే ఆ దంపతులు కోరుకున్నప్పుడల్లా వ్యాసుల వారు దర్శనం అయ్యేలా వరం పొందుతారు. అలాంటి జ్ఞానవాసువులైన గురువులను వ్యాస పౌర్ణమి రోజున పూజిల్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాస మహర్షి వరమిస్తారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి రోజున గురువులను వ్యాస భగవానునిని స్వరూపంగా తలచి కొలుచుకునే ఆచారం వస్తోంది.
ఈ రోజే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాయనం ప్రారంభమౌతుంది. కనుక గురు పౌర్ణిమ రోజున విష్ణు సహస్ర నామ పారాయణం, వ్యాసుని గ్రంథాలు చదవడం, దానధర్మాలతో సుఖసంతోషాలు కలుగుతాయి. త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే సర్వ సంపదలూ కలుగుతాయని విశ్వాసం.