Publish Date: Tue, 19 Mar 2019 (16:01 IST)
Updated Date: Tue, 19 Mar 2019 (16:04 IST)
పురాతన కాలంలో, దేశంలో టెక్నాలజీ లేని కాలంలో శివుని ఆలయాలను ఒక స్ట్రయిట్ లైన్లో ఉండేలా నిర్మించడమనేది సాధారణమైన విషయం కాదు. ఆ కాలంలో ఏలియన్స్ సహాయంతో వీటిని నిర్మించి ఉండవచ్చని వాదన కూడా ఉంది. ఒకే స్ట్రయిట్ లైన్లో నిర్మించబడిన ఈ పంచభూత ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఒకే లాంగిట్యూడ్లో ఉన్న దేవాలయాల సంఖ్య ఎనిమిది. వాటిలో ఆరు దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. కేదార్నాథ్ నుండి మొదలుపెడితే కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర ఆలయం, కాంచీపురంలో ఏకాంబేశ్వర ఆలయం, తిరువనైలోని జంబుకేశ్వర ఆలయం, తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయం, చిదంబరంలో నటరాజస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాధ ఆలయం ఇవన్నీ కూడా ఒకే లాంగిట్యూడ్లో నిర్మించబడ్డాయి.
పంచభూతాలు అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దక్షిణ భారతదేశంలో పంచభూతాలకు ఐదు దేవాలయాలను నిర్మించారు. వీటిలో నాలుగు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అవి కంచిలో పృథ్వి లింగం, చిదంబరంలోని ఆకాశ లింగం, అరుణాచలంలోని అగ్ని, జంబుకేశ్వరంలో నీరు, శ్రీకాళహస్తిలో వాయువు. ఈ ఐదు దేవాలయాలు కూడా యోగిక్ శాస్త్రం ఆధారంగా నిర్మించబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇవన్నీ మ్యాప్లో ఒకే సరళ రేఖలో కనిపిస్తాయి. వేల సంవత్సరాల క్రితం ఎటువంటి పరికరాలు లేకుండానే వీటిని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిదంబరం ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. కానీ 3500 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. వీటి నిర్మాణంలో దేవతలు సహకరించి ఉంటారని కొందరు చెబితే, కొందరు మాత్రం పరికరాలు లేని ఆ కాలంలో ఏలియన్స్ సహాయంతో నిర్మించి ఉంటారని విశ్వసిస్తున్నారు.