Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8న దేవీనవరాత్రులు ప్రారంభం: దుర్గాదేవిని పూజించండి!

Advertiesment
దేవినవరాత్రులు
WD
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్ర్యంబకేదేవి నారాయణి నమోస్తుతే. అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.

ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వము దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుంచి తమను రక్షించుకొనుటకై ఆదిపరాశక్తిని ఆశ్రయిస్తారు. ఇంకా మహాశక్తి కోసం మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమందు వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేసుకుంటారు. దీంతో ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై, వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

కాబట్టి ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ శక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 3. చంద్రఘంట 4. కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయనీ 7. కాళరాత్రి 8.మహాగౌరి 9. సిద్ధిధాత్రి అను రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది.

శ్రీ కృష్ణ పరమాత్మచే గోకులం, బృందావనంలో పూజలందుకున్న ఈ దేవదేవి, బ్రహ్మ, పరమేశ్వరులచే ఆరాధించబడింది. త్రిమూర్తులచేతనే గాకుండా మహామునులు, దేవతలు, సిద్ధులచే జగన్మాత పూజలందుకుంది.

కాబట్టి నవరాత్రుల సందర్భంగా పరమేశ్వరిని పూజించే భక్తులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇంకా ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడిన శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించడానికి చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు.

అందుచేత దేవీనవరాత్రుల్లో తొలి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపాన్ని ఆరాధించడంతో జ్ఞానాన్ని పొందవచ్చును.
webdunia
FILE


శమీపూజ విశిష్టత ఏమిటో తెలుసా?
ఇలా నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించాలి.

ఆ అపరాజితాదేవిని...
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||
అనే శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి.

ఇకపోతే.. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం వల్ల ఆ శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయ్యింది. అందుచేత అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, సర్వదుఖాల నుంచి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో జీవించాలన్నా నవరాత్రుల్లో ఆ దేవదేవిని పూజించడంతో పాటు శమీపూజ, శ్రీలలితా సహస్రనామ పారాయణలు చేయాలని పురోహితులు అంటున్నారు.

దేవీ నవరాత్రుల రోజుల ఎలా పూజ చేయాలంటే..?
ఇంకా దేవీ నవరాత్రుల ప్రారంభం రోజున ఐదింటికే నిద్రలేవాలి. శుచిగా అభ్యంగన స్నానమాచరించి ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించాలి. అనంతరం పూజామందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. పూజమందిరము, గడప, గుమ్మాలను పసుపు, కుంకుమలు, మామిడి తోరణాలు, రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో ఎర్రటి వస్త్రమును, కలశముపై ఎర్ర రంగు రవికను ఉంచాలి.

సింహాన్ని వాహనంగా కలిగిన దుర్గాదేవి ప్రతిమ, ఫొటోలను పూజించాలి. అమ్మవారి పూజకు ఎర్రటి అక్షితలు, ఎర్రరంగు పువ్వులను ఉపయోగించాలి. నైవేద్యం కోసం పొంగలి, పులిహోరలను సిద్ధం చేసుకోవాలి. పండ్లలో ఎర్రని దానిమ్మ పండ్లను నైవేద్యం పెట్టాలి.

తర్వాత దుర్గాదేవీ అష్టోత్తరం, దుర్గాద్వాదశిత్రిశంనన్నామాలు, అర్జునకృత దుర్గాస్త్రోత్రాలు పారాయణం చేయవలెను. దుర్గాసహస్రనామము, దేవీ భాగవతము, మహిషాసుర సంహారము తదితరాలను పారాయణం చేయాలి. తర్వాత దుర్గాదేవి ధ్యానమ్, దుర్గాదేవి అష్టోత్తర పూజలు నిర్వహించాలి. ఇలా నవరాత్రులు అమ్మవారిని నిష్టతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu