2012 జనవరి 14న సూర్యనందిలో బ్రహ్మంగారి దర్శనం..!
కలియుగంలో జరగబోయే అనర్థాలను ముందుగానే తన కాలజ్ఞానంతో గణించిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వచ్చే 2012 జనవరి 14వ తేదీ అర్థరాత్రి 12.30 గంటలకు కర్నూలు జిల్లా, సూర్యనందిలో దర్శనమివ్వనున్నారని బౌద్ధ గురువు దలైలామా సన్నిహితురాలని ప్రకటించుకున్న బాలిక శాంభవి వ్యాఖ్యానించింది. ఆ తర్వాత బ్రహ్మంగారు దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావిస్తాడని శాంభవి భవిష్యవాణి వినిపించింది. సోమవారం నెల్లూరు నగరానికి వచ్చిన శాంభవి విలేకరులతో మాట్లాడుతూ.. మానవజాతికి మితిమీరిపోతున్న స్వార్థంతోనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని శాంభవి వెల్లడించింది. "
ఈ భూమి నాది.., ఇవన్నీ నా సొంతం.." వంటి స్వార్థ చింతన వీడనంత కాలం ప్రకృతి ప్రకోపానికి మానవజాతి గురికాక తప్పదని శాంభవి హెచ్చరించింది. పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అన్నీ భగవంతునికే సొంతమని శాంభవి స్పష్టం చేసింది. అంతేగాకుండా మానవుడు ప్రకృతి ఆరాధనను విస్మరించడమే ఇటువంటి అనర్ధాలకు దారితీస్తుందని పేర్కొంది.ఇదిలా ఉంటే.. నవనంది పుణ్యక్షేత్రాల్లోని శ్రీ సూర్యనంది పుణ్యక్షేత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది అత్యంత త్వరలో పర్యాటక క్షేత్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణం టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా ఈ ఏడాది 21న సూర్యనందికి వస్తున్నారని శాంభవి తెలిపింది. అలాగే డిసెంబర్ 22వ తేదీన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆంగ్ల అనువాద గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని ఆమె వెల్లడించింది.