లక్ష్మీ కటాక్షం కోసం కార్తీక శుక్రవారం దీపారాధన చేయండి!
"
చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" 2 కార్తీక శుక్రవారం రోజు సాయంత్రమున పై శ్లోకమును ధ్యానించి శుచి శుభ్రంగా ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లైతే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శుక్రవారం సాయంత్రమున లక్ష్మీస్వరూపమైన తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి, పై శ్లోకాన్ని పఠించి ఇంటి ముంగిట దివ్వెలను వెలిగించినట్లైతే సర్వసంపన్నులుగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. ఏ ఇంటిముందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో! ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వాసం. అందుచేత కార్తీకమాస ప్రారంభం నుంచి ప్రతి నిత్యము సంధ్యాసమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించినట్లవుతుందని నమ్మకం. కార్తీకమాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవీ, పార్వతీదేవీలను అర్చించినట్లైతే సకలసంపదలు చేరువవుతాయని విశ్వాసం. కార్తీక శుక్రవారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ఒకపూట మాత్రమే భోంజేసి ఉపవాసముండాలి. అయితే... అరటి పండ్లను మాత్రం తీసుకోవచ్చు. లేదా పాయసం కొబ్బర్లతో కూడిన వంటల్ని భుజించవచ్చు. కార్తీక శుక్రవారం స్త్రీలు తెల్లపువ్వులను, కుంకుమ రంగులో గల పువ్వులను ధరించి లక్ష్మీదేవి, పార్వతీదేవిలను అర్చించుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవీ, పార్వతీదేవేరులను ఆలయాలకు వెళ్లి దర్శించుకోవడం శుభప్రదం. అంతేకాకుండా అమ్మవారికి తెల్లపువ్వులను గానీ, మాలలను గానీ సమర్పించుకున్నట్లైతే కోరిక కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.