మాఘపౌర్ణమి నేడే: నదీ జలాల్లో స్నానమాచరించండి!
మాఘ పౌర్ణమి నాడు నదీ జలాలు, సముద్రాలు, చెరువులు, బావుల్లో పవిత్ర స్నానమాచరించడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. మాఘ మాస స్నానం అందం, ఐశ్వర్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాఘమాసంలోని మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్ధశిలలో నదీ జలాల్లో పవిత్ర స్నానమాచరిస్తే కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ద్వారా మాఘమాసంలో పూజలు, దానధర్మాలు, సాధ్యమైనంత వరకు దైవ చింతనతో గడపాలి. ఇంకా సూర్యకిరణాలలోని కొన్ని రకాల రుగ్మతలను నివారించగల శక్తి ఉండటంతో ఆ కిరణాలు శోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా ఆ శక్తి లభిస్తుంది. అందుచేత మాఘమాసంలో వచ్చే ముఖ్య తిథుల్లో నదుల్లో స్నానమాచరించడం ఉత్తమ ఫలితాలనిస్తుందని పురోహితులు సూచిస్తున్నారు.