ప్రధాన ఆలయాల్లో నేటి నుంచి ఆర్జిత సేవలు బంద్!
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో గురువారం నుంచి ఆర్జిత సేవలు బంద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సమాఖ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఎనిమిది దేవాలయాల్లో ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయని సమాఖ్య నాయకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సమాఖ్య చేపట్టిన సమ్మెలో భాగంగా నేటి నుండి ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నారు.ఇప్పటికే తమ డిమాండ్ల సాధన కోసం రెండు రోజుల పాటు పెన్డౌన్ చేపట్టిన ఆలయ ఉద్యోగులు ప్రభుత్వం ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడకపోవడంతో మరోమారు ఆర్జిత సేవలు నిలిపివేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం, ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం, భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలలో ఆర్జిత సేవలు నిలిచిపోతున్నాయి.రాష్ట్రంలో తిరుమల-తిరుపతి దేవస్థానాల తర్వాత ప్రాధాన్యత కలిగిన ఈ ఎనిమిది దేవాలయాల్లో సిబ్బంది, అర్చకులు సమ్మెలో పాల్గొంటున్నందువల్ల ఆర్జితసేవలను నిలిపివేస్తున్నామని సమాఖ్య చైర్మన్ జి. రమేష్బాబు, కన్వీనర్ ముదిగొండ ఫణిదరప్రసాద్ తెలిపారు. అర్చకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నందు వల్ల ప్రత్యేక పూజలు నిర్వహించడం కుదరదన్నారు. అందుకే ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ ఆలయాల్లో పనిచేస్తున్న దాదాపు 600 మంది శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆలయాలకు వచ్చి సంతకాలు చేసి, ఆలయం వెలుపల జరిగే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.