Publish Date: Mon, 21 Jul 2014 (17:43 IST)
Updated Date: Mon, 21 Jul 2014 (17:45 IST)
పేదవాడైన కుచేలుడు సమర్పించిన అటుకులను శ్రీకృష్ణుడు ప్రేమగా అందుకున్నాడు. భక్త కన్నప్ప అందించిన మాంసాన్ని మహాశివుడు నిస్సంశయంగా అందుకున్నాడు. కాబట్టి నైవేద్యంగా ఏం అర్పిస్తున్నామనే దానికంటే భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నామనేదే ముఖ్యమని పురోహితులు చెబుతున్నారు. ఇందులో మహాకాళి అమ్మవారైనా అంతే. అమ్మవారికి మంగళవారం, శుక్రవారాల్లో పండో, పాయసమో ఎదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అవకాశం ఉంటే ఎన్ని పదార్ధాలను అయినా అర్పించవచ్చు.
నానోపహార రూపంచ ||
నానా రస సమన్వితం |
నానా స్వాదుకరం చైవ |
నైవేద్యం ప్రతిగృహ్యతాం ||
అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ నివేదించిన పదార్ధాలపై నీటిని ప్రోక్షించి "సత్యం త్వర్తేనా పరిషించామి అమృతమస్తు.. అమ్రుతోవస్తరణమసి" అంటూ పదార్థాల చుట్టూ ఔపోసనవిధిగా నీరు చిలకరించాలి. తర్వాత
"ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా"
అంటూ ఐదుసార్లు అమ్మవారికి నివేదనము చేసి నమస్కరించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అంటూ నీటిని పదార్థాలపై ప్రోక్షించాలి. "ఉత్తరాపోసనం సమర్పయామి", "హస్తౌ ప్రక్షాళయామి", "పాదౌ ప్రక్షాళయామి", "శుద్ధ ఆచమనీయం సమర్పయామి" - ఇలా పలుకుతూ నాలుగుసార్లు నీటిని సపర్పించాలి. ఇలా పై మంత్రాన్ని పఠిస్తూ నైవేద్యం సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని పండితులు అంటున్నారు.