Publish Date: Mon, 04 Aug 2014 (19:11 IST)
Updated Date: Mon, 04 Aug 2014 (19:13 IST)
శ్రావణ మంగళవారం.. దుర్గాదేవిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూద్దాం.. పూర్వము త్రిపురాసురుని సంహరించేందుకు పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నురాలైన గౌరీదేవిని పూజించి విజయుడైనాడు. అదేవిధంగా.. గౌరీదేవిని నిష్టతో పూజించిన నవగ్రహముల్లో ఒకడైన "కుజుడు" మంగళవారమునకు అధిపతి అయినాడు.
అట్టి మహిమాన్వితమైన గౌరీదేవిని శ్రావణ మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు పూజిస్తే సకల సంపదలు, దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుందని పురోహితులు అంటున్నారు.
అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట మహిళలు శుచిగా స్నానమాచరించి ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, గడపకు, గుమ్మాలకు పసుపు కుంకుమ తోరణాలు, రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సాయంత్రం పూట నిష్టతో దీపమెలిగించి అమ్మవారిని ప్రార్థించాలి. చక్కెరపొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇంకా శ్రావణ మంగళవారం పూట అమ్మవారి ఆలయాలను సందర్శించుకునే వారికి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అంతేగాకుండా ఆలయాల్లో అమ్మవారికి నేతితో దీపమెలిగించడం ద్వారా వంశాభివృద్ధి, సర్వమంగళం చేకూరుతుందని పండితులు అంటున్నారు.