జాతకంలో శని ప్రభావం ఉందని జ్యోతిష్యులు చెప్పారా? శని దశ కారణంతో ఈతి బాధలు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుడి ప్రభావంతో మంచిచెడూ రెండూ జరుగుతుంటాయి. నవగ్రహాల్లో శనీశ్వరుడి పాప గ్రహమంటారు. శనీశ్వరుడు సూర్యుడి పుత్రుడు. అయితే తండ్రీకుమారులైన శనీశ్వరుడికి, సూర్యుడికి ఏమాత్రం పోలికలు వుండవు. వీరిద్దరూ జన్మతహా శత్రువులు.
ఒక్కో రాశిని రెండున్నర సంవత్సరం పాలించే శనీశ్వరుడికి బుధ, శుక్ర, రాహు, కేతు గ్రహాలు స్నేహాధిపత్య గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రు గ్రహాలు. శని దశాకాలం 19 సంవత్సరాలు. శని భగవానుడి వాహనం కాకి, దున్నపోతు. నచ్చిన లోహం ఇనుము. వస్త్రం నలుపు, పువ్వులు నీలపుశంఖువులు. దేవతామూర్తి యముడు. నచ్చిన ధాన్యం నువ్వులు. చేదంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. ఇంకా శనిభగవానుడికి స్తోత్రాలంటే మహాఇష్టం.
అలాంటి శనిభగవానుడిచే ఏర్పడే శనిదోషం నివృత్తికావాలంటే.. శనివారాల్లో వ్రతమాచరించాలి. శనిభగవానుడి సన్నిధిలో రెండు ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపమెలిగించాలి. నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శని కవచం, శనీశ్వర అష్టోత్తరంతో పారాయణ చేయాలి. పేదలకు నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. శనీశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆయనను ప్రార్థించడం చేయకూడదు. ఆయనకు నేరుగా కాకుండా పక్కగా నిలబడి దండం పెట్టుకోవాలి.
ఇంకా తమిళనాడు, కారైక్కాల్ తిరునళ్లార్కు వెళ్ళి.. నళ తీర్థంలో స్నానమాచరించి ఆ శనిదేవుడికి పూజలు చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిదోషాలు నివృత్తి అవుతాయి. కాకికి రోజూ అన్నం పెట్టడం.. ఉద్దిపప్పును దానం చేయడం ఉత్తమం. ఆలయాల్లో నవగ్రహాలను తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేయడం, శనివారాల్లో సూర్యోదయానికి ముందే సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఏలినాటి శని దోషం నివృతి అవుతుంది.
కానీ శనిదోషాల ద్వారా ఈతిబాధలు, సమస్యలు అధికమైనట్లైతే.. నలుపు రంగుతో కూడిన తొక్క తీయని మినపప్పుల్ని 108 తీసుకుని.. రాత్రి దిండు కింద పెట్టి నిద్రించి.. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి.. శనిభగవానుడిని 108 సార్లు ప్రదక్షణ చేయాలి. ఒక్కో ప్రదక్షణ ముగిశాక.. ఒక్కో మినపప్పును శనిభగవానుడి వద్ద ఉంచాలి లేదా నేలపై వదలాలి. ఇలా చేస్తే శనిభగవానుని అనుగ్రహం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.