Publish Date: Mon, 11 Nov 2024 (10:28 IST)
Updated Date: Mon, 11 Nov 2024 (10:30 IST)
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాలు శివ నామస్మరణలతో మారుమోగుతున్నాయి.
ఈ రోజున ఉపవాసం వుంటే సర్వశుభాలు చేకూరుతాయి. ఈ నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకు ఒక అధ్యయనం వంతున చదవడం, వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కార్తీక మాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన వంటివి జరపాలి.
కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపనాశం, మోక్ష ప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే సోమవారం పూట చేసే జపాలు, దానాలు విశిష్ఠ ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసం సాయంత్రం పూట ఆలయంలో దీపం పెట్టాలి.
కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసీ తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెప్తారు. మంత్రాలు, జపాలు కూడా తెలియని వాళ్లు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు.