ఆషాఢ అమావాస్య అరుదైనది. ఇంకా ప్రత్యేకమైనది కూడా. ఆషాఢ అమావాస్య రోజున అప్పుల బాధలతో ఇబ్బంది పడే వారు వేప మొక్కను నాటడం ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ఈ రోజున వేప చెట్టుతో పాటు రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.
ఆషాఢ అమావాస్య నాడు రావిచెట్టును పూజించడం చాలా ఫలవంతమైనది. రావిచెట్టు కింద దేవతల కోసం నువ్వుల నూనెతో ఒక దీపాన్ని, పితృదేవతల కోసం ఆవాల నూనెతో మరొక దీపాన్ని వెలిగించండి. ఇలా రెండు దీపాలు వెలిగించడం వల్ల అపారమైన ప్రయోజనం కలుగుతుంది. ఇది పితృదోషాలను తొలగించి, దేవతల అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
అలాగే ఆషాఢ అమావాస్య రోజున తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల ఇంట్లో, వ్యక్తిగత అన్ని సమస్యలు కూడా తీరిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆషాఢ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి, సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
ఆషాఢ అమావాస్య సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవాల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. అమావాస్య సాయంత్రం పూర్వీకులు భూమి నుంచి తమ లోకాలకు తిరిగి వెళ్తారని నమ్మకం. వారికి దారిలో ఈ వెలుగు లభిస్తే, వారు సంతోషించి తమ సంతతికి అపారమైన ఆశీస్సులు అందిస్తారు.
ఈ ఆశీర్వాదాలు తరతరాలకు మేలు చేస్తాయని ప్రతీతి. ఆషాఢ మాసం అమావాస్య నాడు, ఇంట్లో పితృదేవతల చిత్రాలు ఉన్న ప్రదేశంలో తప్పకుండా ఒక దీపాన్ని వెలిగించాలి.