Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాట‌, పాట‌, నాట‌కంలో సిద్ధ‌హ‌స్తుడు పింగ‌ళి

మాట‌, పాట‌, నాట‌కంలో సిద్ధ‌హ‌స్తుడు పింగ‌ళి
, గురువారం, 6 మే 2021 (12:53 IST)
Pingali
తెలుగు సాహిత్యంలో గ్రాంథికం నుంచి సాధార‌ణ భాష వ‌ర‌కు ప‌ట్టు తెలిసిన వాడు పింగ‌ళి నాగేంద్రరావు. ఆయ‌న మొద‌ట పాత్రియేయుడు. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేశారు. అదే ఆయ‌న‌కు నాట‌కాలు, సినిమాల‌కు ర‌చ‌యిత‌గా రాసి మెప్పించేలా చేసింది. ఆయ‌న వ‌ర్థంతి 1971 మే 6. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు.
 
నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. ఆయన తండ్రి గోపాల కృష్ణయ్య యార్లగడ్డ గ్రామానికి కరణంగా ఉంటూ నాగేంద్రరావు జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముళ్ల దగ్గరికి వచ్చేశారు. నాగేంద్రరావు పినతండ్రులలో ఒకరు డిప్యూటీ కలెక్టర్ మరొకరు ప్లీడర్. నాగేంద్రరావు అన్న శ్రీరాములు 1913 లోనే భారతదేశాన్ని వదిలి 1926 నుంచి ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పింగళికి రెండేళ్ళ వయసులో ఆయన కుటుంబం బందరుకు వలస వెళ్లింది.
 
నాట‌కాలు రాసే కాలం అది. వింధ్యారాణి నాట‌కాన్ని చిత్రంగా తయారయ్యే రోజు 1946లో వచ్చింది. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబూనుకున్నది. దీనికి సి. పుల్లయ్యగారి దర్శకత్వం. ఇందులో డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి. వరలక్ష్మి, పండిట్ రావు ప్రభృతులు పాత్రధారులు. నాగేంద్రరావు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి. పుల్లయ్యగారి పర్యవేక్షణలో వింధ్యరాణి స్క్రిప్టు తయారుచేసాడు.
 
ఇది నాగేంద్రరావుకు తొలి సినిమా అనుభవం. భలే పెళ్ళి సినిమాకి పాటలూ, మాటలూ ఆయనవే. ఈ చిత్రంలో డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య, జయంతి గంగన్న, ఇటీవలే పుట్టిల్లు సినిమా తీసి ఉన్న గరికపాటి రాజారావు, సురభి గోవిందరావు కూతుళ్ళూ, తదితరులు నటించారు. అయితే భలే పెళ్ళి నాగేంద్రరావును సినిమా ప్రపంచంలో నిలబెట్టలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో, సినిమాలు తీయటానికి ఫిల్ము కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ అయ్యి సినిమా చిత్రనిర్మాణం బాగా కుంటుపడగా, నాగేంద్రరావు తిరిగి నాటకాలాడించుకోవటానికి బందరు వెళ్ళిపోవలసివచ్చింది.
 
గుణసుందరి కథ నిర్మాణం నాటికి వాహినీ స్టూడియో తయారై, విజయావారి నిర్వహణ కిందికి వచ్చింది. వాహినీలో మొట్టమొదటి కాల్షీట్ కూడా గుణసుందరి కథదే. గుణసుందరి కథ పూర్తి అయేలోగా విజయా వారు భవిష్యత్తు చిత్రనిర్మాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్ల ప్రకారం నాగేంద్రరావు, కామేశ్వరరావుగారు మొదలైనవారు విజయాసంస్థలోకి తీసుకోబడ్డారు.
 
అప్పు చేసి పప్పు కూడులోని పాట ఇప్ప‌టికీ క‌నెక్ట్ అయ్యేదే
అయితే కె.వి.రెడ్డి విజయావారి ద్వితీయచిత్రం "పాతాళభైరవి" దర్శకత్వం చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కె.వి.రెడ్డితో కలిసి పనిచెయ్యటానికి మరొక అవకాశం లభించింది. ‘అప్పు చేసి పప్పు కూడు’ (1958) సినిమాలో పాట ఒకటి ఉంది. అందులో రేలంగి చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన శిష్యురాలు పక్కనే ఉండి నిజం చెప్పబట్టి అమాయక ప్రజలు ఆ మాయ నుంచి బైటపడతారు. ‘కాశీకి పోయాను రామాహరి... గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి’ అంటాడు రేలంగి. ‘కాశీకి పోలేదు రామాహరి... ఊరి కాల్వలో నీళ్లండి రామాహరి’ అని గిరిజ చెబుతుంది. ఇలా 57 ఏళ్ల క్రితం పింగళి నాగేంద్రరావు రాసిన ఈ పాట ఇప్పుడున్న కొందరు లీడర్ల  అబద్ధాలకూ చక్కగా సూట్ అవడం విశేష‌మే. ఇక మామాబ‌జార్‌లో ప‌నిచేసిప్పుడు అందులోని మాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కోశైలిని పామ‌రుల‌కు అర్థ‌మ‌య్యేట‌ట్లు చేసిన ఆయ‌న ఇప్ప‌టి త‌రానికి ఆద‌ర్శ‌ప్రాయుడు అని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ ఫ్యామిలీనే బీట్ చేసిన వంటలక్క.. ఏం చేసిందో తెలుసా?