Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమయస్ఫూర్తితో ఒకరి ప్రాణాన్ని కాపాడిన ఎన్నారై

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
చక్కటి సమయస్ఫూర్తితో సాటి ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన దీపక్ ఓబ్రాయ్ అనే ఎన్నారై ఉత్తమ పౌరుడిగా కెనడా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కెనడా ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేస్తున్న దీపక్.. ఒట్టావా నుంచి సొంత పట్టణం అయిన కాల్గరీకి విమానంలో బయల్దేరారు.

విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే.. విమాన సిబ్బంది హడావుడిగా తిరుగుతుండటాన్ని దీపక్ గమనించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయనకు అచేతనంగా కింద పడి ఉన్న మహిళ ఒకరు కనిపించారు. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన.. హుటాహుటిన తన వద్ ఉన్న బ్లడ్ టెస్ట్ పరికరంతో ఆమెను పరీక్షించారు.

ఆ మహిళ రక్తంలో చక్కెర స్థాయి పడిపోయిందని తెలుసుకున్న దీపక్.. వెంటనే ఆమెకు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వాల్సిందిగా సిబ్బందికి తెలియజేశారు. జ్యూస్ తాగిన వెంటనే ఆ మహిళ పూర్వ స్థితికి వచ్చి, తన ప్రయాణాన్ని సాఫీగా ముగించుకుని గమ్యస్థానానికి చేరుకుంది.

కాగా... స్వయంగా చక్కెర వ్యాధిగ్రస్తుడైన దీపక్ ఓబ్రాయ్, ఆ మహిళ ఒంట్లో చక్కెర స్థాయి తగ్గిపోయి ఉంటుందేమోనని అనుమానించారు. తన అనుమానం నిజం కావటంతో, సిబ్బందిని ఆరెంజ్ జ్యూస్ ఇవ్వమని చెప్పారు. ఇంత చక్కటి సమస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆయనను విమాన సిబ్బందితోపాటు, నేషనల్ మీడియా పొగడ్తలతో ముంచెత్తింది. ఇదిలా ఉంటే.. కెనడా విదేశాంగ మంత్రికి పార్లమెంటరీ సెక్రటరీ కూడా అయిన దీపక్.. కాల్గరీ నుంచి ఎంపీగా ఐదుసార్లు ఎంపికయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu