Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షార్జాలో "మాంద్యం" దెబ్బకు భారతీయుల ఆత్మహత్య

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ఆర్థిక మాంద్యం దెబ్బకు మరో ఇద్దరు భారతీయులు బలయ్యారు. అనేకమంది ఉద్యోగాలను ఖాళీ చేయిస్తోన్న "మాంద్యం" పలువురి ప్రాణాలను బలిగొంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు నిదర్శనమే షార్జాలో ఒకే సంస్థకు చెందిన ఇద్దరు భారత కార్మికుల ఆత్మహత్య.

ప్రాజెక్టులు తగ్గిన కారణంగా కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో వీరిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్లు సదరు సంస్థ ఇచ్చిన సమాచారమే.. ఇద్దరు భారతీయుల ఆత్మహత్యకు కారణమయ్యిందని తోటి ఉద్యోగస్తులు వాపోతున్నారు. ఉద్యోగం కోల్పోతున్న విషయం తెలియడంతో మనోవ్యధకు గురయిన ఇద్దరు భారతీయులు బలవంతంగా ప్రాణాలను తీసుకున్నారు.

కాగా... షార్జాలోని ఓ కాంట్రాక్ట్ కార్మికుల సంస్థకు చెందిన 28 సంవత్సరాల భారతీయుడొకరు గొంతుకు ప్లాస్టిక్ తీగను బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు "ఖలీజ్ టైమ్స్" వెల్లడించింది. అదే రోజు సాయంత్రం అదే సంస్థకు చెందిన మరో 24 ఏళ్ల భారతీయుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఉద్యోగం పోతున్న విషయం తెలియడంతో ఇంటికి చేరుకున్న ఇతడు మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఖలీజ్ టైమ్ పేర్కొంది.

ఇదిలా ఉంటే... మరణించిన ఈ ఇద్దరు భారతీయుల వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదని షార్జా పోలీసులు తెలియజేశారు. అయితే వీరి మృతదేహాలను మాత్రం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu