మలేషియా వెళ్తుంటే జర జాగ్రత్త: భారత ప్రభుత్వం
వివిధ పనులకోసం మలేషియా వెళ్లే భారతీయ వర్కర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని భారత ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఉపాధి మార్గదర్శక సూత్రాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలనీ, మలేషియా వెళ్లేందుకు నిజమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని లిపింది. అదే విధంగా రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, వారు చెప్పే మాటలను నమ్మకుండా తగిన జాగ్రత్తలను పాటించాలని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.మలేషియాలోని రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ వర్కర్లు ఉద్యోగాల కోసం అక్కడికి తరలి వెళ్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు ఈ మేరకు భారత విదేశాంగ శాఖ పై ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎలాంటి విలువలూ పాటించని కొంతమంది రిక్రూటింగ్ ఏజెంట్లు భారత వర్కర్లను మోసం చేస్తున్నారని ఆ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.రిక్రూటింగ్ ఏజెంట్లు ఉద్యోగ నియామకానికి అవసరమైన నిజమైన పత్రాలు ఇవ్వకుండా భారతీయులను దగా చేస్తున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి కౌలాలంపూర్లోని భారత హై కమీషన్కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వివిధ పనుల రీత్యా మలేషియా వెళ్లాలనుకునే భారతీయ వర్కర్లు ఏజెంట్ల మాటలను నమ్మి మోసకుండా జాగ్రత్తపడాలని సూచించింది.