నేటి నుంచి న్యూఢిల్లీలో "ప్రవాసీ భారతీయ దివస్"
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే "ప్రవాసీ భారతీయ దివస్" గురువారం నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు పలువురు హాజరుకానున్నారు.పెట్టుబడులు పెట్టేలా ప్రవాస భారతీయులను ప్రోత్సహించటంపైనే ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సదస్సుకు దాదాపు పదిహేను వందలమంది దాకా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది.పదిహేనుమంది ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవాస భారత వ్యవహారాల శాఖ వెబ్సైట్లో ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం అందుబాటులోకి తేవటం విశేషం.