ఎన్నారై అశోక్ సేవల్ని శ్లాఘించిన బ్రిటీష్ పార్లమెంట్..!!
యూకేలో అనుమానాస్పద స్థితిలో తన స్వగృహంలో మృతిచెంది ఉన్న భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ సేవలను బ్రిటీష్ పార్లమెంట్ కొనియాడింది. సహజ పోరాటయోధుడు, జాతి నాయకుడిగా పేరుగాంచిన ఓ శ్రద్ధాపూర్వక సభ్యుడిని సభ కోల్పోయిందని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో అశోక్కు నివాళులు అర్పించింది.బ్రిటీష్ దిగువ సభకు ఎన్నికైన ఐదో దక్షిణాసియాకు చెందిన జాతీయుడిగా ఘనత సాధించిన అశోక్ మృతిపట్ల ఆ దేశ ప్రధానమంత్రి గార్డెన్ బ్రౌన్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఇంకా ప్రముఖ ప్రవాస వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్పాల్ అశోక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన నేతను, ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తను కూడా కోల్పోయామనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అశోక్ మరణవార్త విని తీవ్ర విచారంలో మునిగిపోయినట్లు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో తన సంతాపం వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం అశోక్ కుమార్ వయస్సు 53 సంవత్సరాలు కాగా.. ప్రమాదవశాత్తు, ఆకస్మికంగా మృతి చెందినట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన మృతి అనుమానాస్పదమైందని చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని అక్కడి పోలీసు అధికారి ఒకరు అంటున్నారు. ఆయన మృతి వెనుక కారణాలను కనుగొనేందుకు విచారణ జరుపుతున్నామన్నారు.ఇదిలా ఉంటే.. ఈశాన్య ఇంగ్లండ్లోని దక్షిణ మెడిల్స్బారో-తూర్పు క్లీవ్లాండ్ నియోజక వర్గానికి అశోక్ కుమార్ ప్రాతినిధ్యం వహించారు. 1956లో భారతదేశంలో జన్మించిన ఈయన 1985-97 మధ్య కాలంలో బ్రిటీష్ స్టీల్లో పనిచేశారు. అంతకుముందు ఇంపీరియల్ కాలేజీలో మూడు సంవత్సరాలపాటు రీసెర్చీ ఫెలోగా విధులు నిర్వహించారు. తదనంతరం 1997 నుంచి అశోక్ ఎంపీగా పనిచేశారు.