Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియా సురక్షితమే : ఆంధ్ర విద్యార్థి రాజన్

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షితమైన దేశమేనని.. అక్కడ విద్యనభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సిద్ రాజన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వీధుల్లో ఒంటరిగా తిరిగేందుకు తానేమీ భయపడటంలేదనీ, భయపడాల్సిన పనిలేదనీ రాజన్ చెబుతున్నాడు.

మోనాష్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రాజన్ (25) "ఔట్‌డోర్ ఎడ్యుకేషన్" స్పెషలైజేషన్‌తో చదువుతున్న ఆనర్స్ డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా తన ఒంటిచక్రం సైకిల్‌పై విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నాడు. పనిలో పనిగా ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించేందుకు కూడా పూనుకుంటానని రాజన్ పేర్కొన్నాడు.

అడిలైడ్ నుంచి సిడ్నీ వరకు మెల్‌బోర్న్, కాన్‌బెర్రాల మీదుగా మొత్తం 2,049 కిలోమీటర్ల దూరాన్ని తన ఒంటిచక్రం సైకిల్‌తో చుట్టనున్నాననీ.. ఈ యాత్రను నవంబర్‌లో మొదలుపెట్టి, డిసెంబర్‌‌తో ముగించనున్నానని రాజన్ వెల్లడించాడు. ఈ యాత్రతో ఆస్ట్రేలియా దేశం భారతీయులకు, విదేశీయులకు సురక్షితమైన ప్రాంతమేనని అందరికీ భరోసా కలిగించేందుకు కూడా కృషి చేస్తానని ఇతను ధీమాగా చెబుతున్నాడు.

తన ఈ ఒంటిచక్రం సైకిల్ యాత్రకు "థ్రీ ఓషన్స్ యూని సైకిల్ టూర్" అని పేరు కూడా పెట్టుకున్న రాజన్.. ఇంతకుముందు పెర్త్ నుంచి అడిలైడ్ వరకు సైకిల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు. జూన్ నుంచి రెండు నెలల్లో ఏకంగా 3,700 కిలోమీటర్ల దూరాన్ని ఒంటిచక్రంతో ఎంచక్కా చుట్టేశాడు.

తాజాగా చేయనున్న యాత్రలో విరాళాలను సేకరించి భారతదేశంలోని పేద విద్యార్థులకు సహాయం చేయాలని రాజన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక రోజున ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవ చేస్తానని.. తాజా యాత్రపై డాక్యుమెంటరీని రూపొందించేందుకు ఆసీస్ ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయాన్న అందించాలని రాజన్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu