ఆస్ట్రేలియా చేరుకున్న ఎస్.ఎం. కృష్ణ
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... భారత విద్యార్థుల భద్రత విషయమై, విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకునేందుకు భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ బుధవారం రాత్రి సిడ్నీ చేరుకున్నారు. ఐదు రోజులపాటు ఇక్కడ పర్యటించనున్న ఆయన, సంబంధిత నేతలతో పలు విషయాలపై కూలంకషంగా చర్చించనున్నారు.ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్తో కృష్ణ సమావేశం కానున్నారు. కాగా.. నాయకత్వంతో చర్చలు జరిపేటప్పుడు భారత విద్యార్థులపై వరుస దాడులు, యురేనియం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత అంశాలనే ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫసిఫిక్ ఐలాండ్ ఫోరం సదస్సులో కూడా పాల్గోనున్న విదేశాంగ మంత్రి.. ఆస్ట్రేలియా ప్రధానితో సమావేశం సందర్భంగా భారత్కు యురేనియంను ఎగుమతి చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. అలాగే అణువ్యాప్తి నిరోధం విషయంలో భారత్ నిబద్ధతను మరోమారు మంత్రి పునరుద్ఘాటించనున్నారు.ఇదిలా ఉంటే... ఎన్పీటీపై భారత్ సంతకం చేసేంతదాకా యురేనియం ఎగుమతులపై తమ విధానాన్ని సమీక్షించే అవకాశమే లేదని ఆస్ట్రేలియా పేర్కొంటోంది. అదలా ఉంచితే, భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో వారి భద్రతకు ఆస్ట్రేలియా యంత్రాంగం చేపడుతున్న చర్యలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోనున్నారు.