అమెరికాలో ప్రవాస భారతీయుడికి అరుదైన గౌరవం
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఒకరికి అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని ఒక వీధికి భారతీయ అమెరికన్ సతీష్ మెహతానీ పేరు పెట్టారు. సంప్రదాయ భారతీయ వంటకాలు, సంస్కృతికి ప్రాచుర్యం కల్పించినందుకు, ఎడిసన్ నగర ఆర్థికాభివృద్ధికి పాటుపడినందుకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది.కాగా.. ఎడిసన్ మేయర్ జన్ చాయ్ చేతులమీదుగా "మెత్వానీ వే" ప్రారంభమయ్యింది. యుద్ధవీరుల పేర్లను మాత్రమే అక్కడి వీధులకు పెడుతుంటారు, అయితే మొదటిసారిగా ప్రవాస భారతీయుడికి ఈ గౌరవం దక్కటం విశేషం. ఈ నేపథ్యంలో మేయర్ జన్ చాయ్ మాట్లాడుతూ.. ఎడిసన్ నగర ఆర్థికాభివృద్ధికి, ఘనమైన భారతీయ సంస్కృతికి ఆయన అందించిన సేవలకు గుర్తింపే ఇదని అన్నారు. కాగా.. లిటిల్ ఇండియాగా పేరుగాంచిన ఎడిసన్ సిటీలో సతీష్ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజెర్సీలో పలు హోటళ్లను నడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. 1970లో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన మెహతానీ ఇండో-స్విస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బంగారు పతకం సాధించారు. ఇన్స్యూరెన్స్ ఏజెంట్గా 20 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆయన భార్యతో కలిసి హోటళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. న్యూయార్క్, సెయింట్ థామస్, వర్జిన్ ఐలాండ్లలో వరుసగా హోటళ్లను ప్రారంభించారు.