అత్తగారింట్లో భారీ చోరీకి పాల్పడి ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు... చివరకు అతని చేతిలోనే హతమైంది. ప్రియురాలి నోటిలో బాంబు పెట్టి ప్రియుడు పేల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే,
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన దర్శిత (20) భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల దర్శిత, తన అత్త కేసీ సుమత ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.4 లక్షల నగదు దొంగిలించి సిద్ధరాజుతో కలిసి కర్ణాటకకు పారిపోయింది. దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న కేరళ పోలీసులు దర్శితను విచారించగా, తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పింది.
కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ తాలూకా పరిధిలోని భేర్య గ్రామంలో ఉన్న ఓ లాడ్జిలో దర్శిత, సిద్ధరాజు గది అద్దెకు తీసుకున్నారు. అక్కడ దొంగిలించిన సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధరాజు, గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాన్ని దర్శిత నోటిలో ఉంచి ట్రిగ్గర్ పేల్చాడు. ఈ దాడిలో ఆమె ముఖం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మొబైల్ ఫోన్ పేలడం వల్లే ఆమె చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన సిద్ధరాజు, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, కేరళ దొంగతనం కేసుకు, ఈ హత్యకు సంబంధం ఉందని గుర్తించి రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.