Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవధ్‌ను గెలిస్తే యూపీని గెలిచినట్టే.. నేడు యూపీలో నాలుగో దశ పోలింగ్...

అవధ్‌ను గెలిస్తే యూపీని గెలిచినట్టే.. నేడు యూపీలో నాలుగో దశ పోలింగ్...
, బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:10 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇపుడు నాలుగో దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దశ ఎన్నికలే రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
రాష్ట్రంలోని అవధ్ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. అవధ్‌ను గెలిస్తే యూపీనే గెలిచినట్టేనన్న నానుడి కూడా ఎప్పటి నుంచో ఉంది. దీంతో అవధ్‌లో అధిక సీట్లను గెలుచుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడాయి. 
 
ఈ దశలో మొత్తం 9 జిల్లాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయిబరేలి లోక్‌సభ స్థానం, అలాగే, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిలిబిత్ స్థానాలు అవధ్ రీజియన్‌లోనే ఉన్నాయి. 
 
అదేవిధంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను కారుతో తొక్కించి చంపిన వ్యవహారం దేశ రాజకీయాలను ఓ కుదుపుకుదిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న లఖింపూర్ ఖేరీ స్థానంలో కూడా నాలుగో దశలో పోలింగ్ జరుగనుంది. 
 
మొత్తంగా ఈ నాలుగో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తం 60 సీట్లలో 624 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్, బీఎస్పీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 57, ఎస్పీ 58 చోట్ల పోటీ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత