తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈనల 16వ తేదీన జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో శైలిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇలాంటి వారిలో పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ ఒకరు. కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేరన్నారు.
ఈ దఫా అన్బుమణిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని జోస్యం చెప్పారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కరుణానిధి, జయలలితను మినహాయించి 35 ఏళ్ళలోపు యువకుడు ఒక ముఖ్యమంత్రిగా లభించాడన్న భావనలో ప్రజలు ఉన్నారన్నారు. అంతేకాకుండా, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో యువకులు, మధ్యతరగతి ప్రజలు ఓట్లు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదన్నారు. కానీ ఈ దఫా ఇలాంటి వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అమితాసక్తిని చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
1965లో జరిగిన విద్యార్థి తిరుగుబాటు ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకళించి, ద్రావిడ పార్టీల పాలనకు శ్రీకారం చుట్టేలా చేసిందన్నారు. అదేవిధంగా ఇపుడు కూడా అన్నాడీఎంకే, డీఎంకే పాలనకు చరమగీతం పాడి, అన్బుమణి రాందాస్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని రాందాస్ అన్నారు.