Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీకి భారీగా కేంద్ర బలగాల తరలింపు

యూపీకి భారీగా కేంద్ర బలగాల తరలింపు
, మంగళవారం, 5 నవంబరు 2019 (20:00 IST)
అయోధ్యపై తీర్పు రాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ కు భారీగా కేంద్ర బలగాలను తరలించింది. ఇప్పటికే రాష్ట్రమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రధాన నగరాలు, పట్టణాల్లో భారీగా బలగాలను మోహరించారు.

మంగళవారం అదనంగా 4 వేల మంది కేంద్ర బలగాలను ప్రభుత్వం యూపీకి పంపింది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా బలగాలను మోహరిస్తున్నారు. బీ ఎస్ ఎఫ్, ఆర్ ఏ ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్, ఐ టీ బీ పీ , ఎస్ ఎస్ బీ కి చెందిన 15 కంపెనీల బలగాలను యూపీకి తరలించారు.

కేంద్ర బలగాలన్నీ నవంబరు 18 వరకు ఆ రాష్ట్రంలోనే ఉంటాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసే తేదీ లోగా అంటే ఈ నెల 17వ తేదీలోగా అయోధ్యపై తీర్పు వెలువడనుంది.
 
అల్లర్లకు కుట్ర...
అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లర్లకు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏడుగురు నేపాల్ దేశం మీదుగా మన దేశంలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించారని ఇంటలిజెన్స్ వెల్లడించింది. పాక్ నుంచి వచ్చిన ఏడుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురిని ఇప్పటికే భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సమాచారం.

యూపీలోని అయోధ్య, గోరఖ్‌పూర్ నగరాల్లో పాక్ ఉగ్రవాదులు ముహమ్మద్ యాకూబ్, అబూహంజా, ముహమ్మద్ షాబాజ్, నిస్సార్ అహ్మద్, ముహ్మద్ క్వామీ చైదరిలు దాక్కున్నారని ఇంటలిజెన్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది.

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఇంటలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలతో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.

అయోధ్యలో శాంతిభద్రతల పరిరక్షించేందుకు వీలుగా అవసరమైతే జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ఉగ్రవాదులను అణచివేస్తామని డీజీపీ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: ఏపి గ‌వ‌ర్న‌ర్