Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతలో పఠనాసక్తిని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి

యువతలో పఠనాసక్తిని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:29 IST)
యువత అక్షరాస్యత పునాదులను మరింత బలోపేతం చేసేందుకు గానూ వారిలో పఠనాసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

వివిధ పుస్తకాల పఠనం ద్వారా విద్యార్థుల మేధోవికాసానికి బాటలు పడతాయని, ఇందుకోసం అవసరాన్ని మించిన ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని త్యజించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఆదికవి సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సరళాదాస్ ఒడియాలో విరచించిన మహాభారతానికి ఇన్ని శతాబ్దాలయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్థానిక భాషలో, సరళమైన పదజాలంతో ప్రజలకు అర్థమయ్యేరీతిలో జరిగే రచనల సామర్థ్యానికి ఇదొక చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

తరగతి గదులను, తరగతి పుస్తకాలనే కాకుండా అనేక పుస్తకాల ప్రపంచంగా మార్చడం ద్వారా విద్యార్థుల్లో పఠనంతోపాటు వివిధ అంశాలపై ఆసక్తిని పెంపొందించవచ్చని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇందుకుగానూ చిన్నారుల ఆసక్తులతోపాటు వారి సామర్థ్యాలకు అనుగుణంగా రచనలు చేయాలని రచయితలు, విద్యావేత్తలకు పిలుపునిచ్చారు.

పరిపాలన, న్యాయ విభాగాల్లో స్థానిక భాష వినియోగాన్ని మరింతగా పెంచడం ద్వారా ప్రజలు తమ విధులను సౌకర్యంగా నిర్వహించేందుకు వీలుంటుందన్న ఉపరాష్ట్రపతి, కనీసం పాఠశాల విద్య వరకు మాతృభాషలో జరగడం కూడా అత్యంత అవసరమని, ఇది పిల్లల మేధోవికాసానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. దీన్ని బలపరుస్తూ వెల్లడైన పలు అంతర్జాతీయ పరిశోధనల నివేదికలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు.

ఈ సందర్భంగా సరళాదాస్‌ను ఆదికవిగా, ఆది ఐతిహాసికగా, ఆది భౌగోళ్‌బిత్‌గా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. 15వ శతాబ్దంలోనే సాహిత్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో అందించేందుకు కృషిచేసిన మహనీయుడని సరళాదాస్‌ను ప్రశంసించారు.

సరళాదాస్‌ను కబీర్, యోగి వేమనలతో పోల్చిన ఉపరాష్ట్రపతి, గొప్పకవులందరూ సంక్లిష్టమైన భావాలను, ఆలోచనలను కూడా సరళమైన, సామాన్యులు మాట్లాడుకునే భాషలో సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు చేరవేయడంలో సమర్థవంతమైన పాత్రపోషించారని పేర్కొన్నారు.

మహాభారతంలోని పాత్రలను కథానాయకులు, కథానాయికలుగా సరళాదాస్ అభివర్ణించిన తీరు నుంచి స్ఫూర్తిపొందిన వివిధ తరాలకు చెందిన రచయితలు అందులో పేర్కొన్న ఒకటి రెండు పాత్రల ఆధారంగా వచ్చిన నవలలు ప్రాచుర్యం పొందిన విషయాన్ని కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఓ సాహిత్య మేధావిగా సరళాదాస్‌ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఒడియా భాషను, సంస్కృతిని ప్రోత్సహించి ‘ఒడియా భాషాపిత’గా కీర్తిగడించారన్నారు.

‘ఒడియా భాషలను భారతదేశ ప్రాచీన భాషన భాషల్లో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో సరళాదాస్ చేసిన రచనల ప్రభావం కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని నొక్కిచెప్పారు..ఈ సందర్భంగా ‘కళింగరత్న’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్ టెక్నాలజీని గ్రామస్థాయి వరకు చేరుస్తాం: మంత్రి గౌతమ్ రెడ్డి