ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసుతో సంబంధం ఉన్న వారంతా హర్యానా రాష్ట్రంలోని అల్ ఫలాహ్ వైద్య విశ్వవిద్యాలయంలో ఆశ్రయం పొందారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ విద్యా సంస్థ నుంచి 10 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో అరెస్టయిన నిందితులకు ఈ వర్శిటీతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వ్యవహారాలపై అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారని నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
'కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరిలో ముగ్గురు కాశ్మీర్వాసులు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో పేలుడు ఘటనతో ముడిపడిన ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని ఇప్పుడే ధ్రువీకరించలేం' అని నిఘా వర్గాలను ఉటంకించాయి. ఈ టెర్రర్ మాడ్యుల్కే చెందిన ఉమర్.. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడుకు కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో అల్ ఫలా వర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యులు సహా తొమ్మిది మంది అరెస్టయ్యారు.
అల్ ఫలా వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు నిర్వహించింది. అల్ ఫలా గ్రూప్ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్టు చేసింది. తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం రూ.415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే, ఉగ్ర నెట్వర్క్తో సంబంధాలు బయటపడిన అనంతరం భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయు) ఈ వర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.