Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధినేతల మరణాల సాక్షిగా మలుపు తిరిగిన తమిళ రాజకీయ చదరంగం

గత మూడు దశాబ్దాలకుపైగా తమిళనాట కీలకమైన రాజకీయ పరిణామాలన్నీ అధినేతల మరణాలతో ముడిపడి ఉండటం కాకతాళీయమే కావచ్చు. కానీ అప్పుడూ ఇప్పుడూ కూడా అధినేతల మరణాలతోనే తమిళ రాజకీయాలు మూలమలుపు తిరగటం గమనార్హం. ఆ చరిత్రను అవలోకన చేస్తే..

అధినేతల మరణాల సాక్షిగా మలుపు తిరిగిన తమిళ రాజకీయ చదరంగం
హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (03:06 IST)
గత మూడు దశాబ్దాలకుపైగా తమిళనాట కీలకమైన రాజకీయ పరిణామాలన్నీ అధినేతల మరణాలతో ముడిపడి ఉండటం కాకతాళీయమే కావచ్చు. కానీ అప్పుడూ ఇప్పుడూ కూడా  అధినేతల మరణాలతోనే తమిళ రాజకీయాలు మూలమలుపు తిరగటం గమనార్హం. ఆ చరిత్రను అవలోకన చేస్తే..
 
డీఎంకే నుంచి చీలిపోయి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎదురులేని నేతగా.. తమిళుల ఆరాధ్యదైవంగా పూజలందుకున్న ఎం.జి.రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. అప్పటికే ఆయనతో కలిసి అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయలలిత.. ఆయన ఆశీస్సులతోనే పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా పనిచేస్తూ ప్రజాదరణ పొందారు. కానీ.. ఎంజీఆర్ భార్య జానకికి ఆమె అంటే పడదు. దీంతో ఎంజీఆర్ చనిపోయినపుడు ఆయన స్వగృహం ‘గార్డెన్స్’లో మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జయలలితను లోనికి కూడా రానివ్వలేదు. 
 
అయితే.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలుకు తరలించినపుడు మాత్రం జయలలిత ఆయన తల వద్ద కదలకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ భౌతికకాయం ఉంచిన వాహనం పైకి జయలలిత ఎక్కినప్పుడు కూడా.. ఆమెను ఆ వాహనం నుంచి కిందికి తోసేసిన ఘటనను ప్రజలందరూ వీక్షించారు.
 
ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. రాజకీయ చదరంగం మొదలైంది. జానకి వయసు 62 ఏళ్లు. జయలలిత వయసు 39 సంవత్సరాలు. ఇద్దరూ శాసనసభ్యలు కారు. అప్పటికే రాజ్యసభ ఎంపీ అయిన జయలలిత కొద్ది రోజుల్లోనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి జానకి సిద్ధమయ్యారు. జయలలిత ఆమెకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాల్లో చీలిపోయారు. జానకి శిబిరంలో 95 మంది ఎమ్మెల్యేలు చేరితే.. జయ శిబిరంలో 30 మంది జమయ్యారు. కానీ.. తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించుకుంది. 
 
జానకికి మద్దతుగా ఎంజీఆర్ అనుచరుడు ఆర్.ఎం.వీరప్పన్ నిలిస్తే.. జయలలితకు మద్దతుగా ఎస్.తిరునావుక్కరసర్ పనిచేశారు. వీరప్పన్.. జానకి వర్గం ఎమ్మెల్యేలను నగరంలోని త్రీస్టార్ హోటల్ ‘ప్రెసిడెంట్’కు తరలించారు. తిరునావుక్కరసర్.. జయ వర్గం ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్ ‘అడయార్ పార్క్’లో ఉంచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ‘భారత దర్శన్’ యాత్ర పేరుతో పర్యటనకు కూడా పంపించారు. ఇండోర్, ముంబై తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్కు వారిని తరలించారు.
 
అప్పటి గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా.. ఇరు పక్షాలనూ ఆహ్వానించారు. తమ బలాలను చూపించమని కోరారు. జానకి మద్దతుదారులను వీరప్పన్ రాజ్ భవన్కు తీసుకెళ్లి గవర్నర్ ముందు నిలిపారు. కానీ.. జయ ఆ పని చేయలేదు. ఎందుకంటే అవసరమైనంత మంది సభ్యులు ఆమెవైపు లేరు. దీంతో 1998లో జానకిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఖురానా ఆహ్వానించారు. కానీ.. ఆ ప్రభుత్వం కేవలం రెండు వారాలే సాగింది. విశ్వాస పరీక్ష కోసం శాసనసభ సమావేశమైనపుడు.. జయ, జానకి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. 
 
అప్పటి శాసనసభ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్.. అనూహ్యంగా పోలీసులను పిలిపించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ కూడా చేయించడం సంచలనం సృష్టించింది. అసమ్మతి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష డీఎంకే ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో జానకి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ పాండ్యన్ ప్రకటించారు. అయితే.. ఆ ఓటింగ్ ప్రక్రియ పద్ధతిగా జరగలేదంటూ గవర్నర్ ఖురానా.. జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
 
ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నా డీఎంకేలో వర్గ పోరు ప్రతిపక్ష  డీఎంకేకు లాభించింది. ఆ పార్టీ 13 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానకి రాజకీయాల నుంచి వైదొలగగా.. అన్నా డీఎంకే చీలిక వర్గాలు రెండూ జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ ఒత్తిడితో 1991 జనవరిలో తమిళనాడులో కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో అన్నా డీఎంకే భారీ విజయం సాధించింది. జయలలిత 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
                                                                                                               
సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. 
 
తదనంతరం గత పది రోజులుగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే నాడు జానకి రామచంద్రన్ ప్రభుత్వంలాగా కాకుండా ఇప్పుడు పళనిస్వామి ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ శశికళ వర్గంలో విభేదాలు ఏ స్థాయికి పెరిగి పళని ప్రభుత్వం కూలిపోతుందా అనేది ఇప్పటికయితే అంచనాలకు అందని విషయమే...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు ఎంజీఆర్ ఇప్పుడు జయలలిత మృతి : అసెంబ్లీలో అదే డ్రామా!