రామ్ కుమార్ ఓ పిచ్చోడు.. పోలీసు కస్టడీ వద్దు.. లాయర్ : 3 రోజులు పాటు కస్టడీ.. కోర్టు
స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రామ్ కుమార్ ఓ పిచ్చోడు అని, అతని మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని అందువల్ల పోలీసు కస్టడీకి అవసరం లేదని అతని తరపు న్యాయవాది కోరారు.
స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రామ్ కుమార్ ఓ పిచ్చోడు అని, అతని మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని అందువల్ల పోలీసు కస్టడీకి అవసరం లేదని అతని తరపు న్యాయవాది కోరారు. అయితే, రామ్కుమార్ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.
గత జూన్ 24న నుంగంబాక్కం రైల్వేస్టేషన్ వద్ద స్వాతి దారుణ హత్యకు గురికావడం, ఆ స్టేషన్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలలో హంతకుడి వీడియో దృశ్యాలు లభ్యం కావటంతో నగర పోలీసులు హత్య జరిగిన ఆరు రోజులలోపునే కేసును చేధించి మీనాక్షిపురం వద్ద తన ఇంటిలో దాగిన రామ్కుమార్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే, రామ్కుమార్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకునే నిమిత్తం ఎగ్మూరు కోర్టులో హాజరుపరిచారు. పుళల్ సెంట్రల్ జైలును గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య వ్యాన్లో రామ్కుమార్ను తీసుకువచ్చిన పోలీసులు అతడిని ఎగ్మూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
వ్యాన్లో నుంచి దిగిన రామ్కుమార్ కోర్టు లోపలకు నడచి వెళ్లేంత వరకు ప్రసార మాధ్యమాల కెమెరాలకు, ప్రతినిధులకు కంటబడకుండా రెండు చేతులతో ముఖాన్ని మూసుకున్నాడు. రామ్కుమార్ను హాజరుపరచిన తర్వాత అతడిని ఐదురోజులపాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతించాలని పోలీసులు దరఖాస్తు పెట్టుకున్నారు.
ఈ దరఖాస్తును రామ్కుమార్ తరపు న్యాయవాది రామరాజ్ వ్యతిరేకించారు. రామ్కుమార్ మానసిక పరిస్థితి బాగాలేదని, కనుక అతడిని పోలీసు కస్టడీకి పంపకూడదని వాదించారు. అదేసమయంలో రామ్కుమార్కు జైలులో వైద్యసేవలందిస్తున్న డాక్టర్ నవీనకుమార్ మాట్లాడుతూ నిందితుడి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందన్నారు. వాదప్రతివాదనల అనంతరం మేజిస్ట్రేట్ రామ్కుమార్ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు.