చనిపోయిందని భావించిన వృద్ధురాలికి అంత్యక్రియలు చేస్తుండగా బతకడంతో అంత్యక్రియలకు వచ్చినవారంతా నివ్వెరపోయారు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే మహేంద్ర కుమార్ అనే వ్యక్తి బంగారు వ్యాపారం చేస్తున్నాడు. ఈయన భార్య పద్మాబాయ్కి ఆరోగ్యం క్షీణించి మే 16న అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కాగా గత మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో వెంటిలేటర్ సహాయంతో డాక్టర్లు చికిత్స అందించారు. ఆమె బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇకపోతే పద్మాబాయ్ చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఢిల్లీ, రాజస్థాన్లోని తమ బంధువులకు సమాచారం అందించారు. పత్రికల్లో అశ్రునివాళి ప్రకటనలు కూడా ఇచ్చారు.
ఈ విషయం తెలిసిన బంధువులు ఆమె చివరి చూపు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చారు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె శ్వాస తీసుకోవడం గమనించిన కుటుంబసభ్యులు విస్తుపోయారు. దీంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో, చనిపోయినట్లు పొరబడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాటుచేశారు. చివరకు ఆమె బతికే ఉండని తెలియడంతో కుటుంబసభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు.