దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా కేసులో తాజాగా మరో నిజం వెలుగు చూసింది. షీనా బోరాను ఆమె తల్లే హత్య చేసినట్టు ఇప్పటికే తేల్చింది. ఈ నేపథ్యంలో షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా మాజీ కారు డ్రైవర్, ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన శ్యామ్ రాయ్ అప్రూవర్గా మారిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కోర్టుకు లేఖ రాశాడు.
షీనా బోరాను కారులోనే గొంతు నులిమి చంపారని శ్యామ్ లేఖలో పేర్కొన్నాడు. ఈ కేసులో తనకు భాగముందని.. జరిగిన నిజాలన్నీ కోర్టుకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. అదేసమయంలో ఈ కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోర్టును ప్రాధేయపడ్డాడు.
2012లో షీనాబొరా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆర్థిక కారణాల వల్లే తల్లి ఇంద్రాణీ.. మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి షీనాను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో వారిద్దరినీ దోషులుగా గుర్తిస్తూ.. గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. అనంతరం ఇంద్రాణి భర్త పీటర్కు కూడా ఈ కేసుతో సంబంధముందని ఆరోపిస్తూ.. గత నవంబర్లో అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు.