ఐఎన్ఎస్ ఖండేరీ ప్రారంభం.. శత్రుదేశాలు పాక్ - చైనా వెన్నులో వణుకు
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ సహకార ఒప్పందాల్లో భాగంగా భారత్లో సబ్మెరైన్లను తయారు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన స్కార్పీన్ శ్రేణి డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెర
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ సహకార ఒప్పందాల్లో భాగంగా భారత్లో సబ్మెరైన్లను తయారు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన స్కార్పీన్ శ్రేణి డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ ఖండేరీని గురువారం ప్రారంభించారు. దీనిని ముంబైలోనీ మాజగావ్ డాక్ బిల్డర్స్లో ప్రారంభించారు. ఇక్కడ ఫ్రాన్స్ సహకారంతో మొత్తం ఆరు సబ్మెరైన్లు నిర్మిస్తున్నారు. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.19వేలకోట్లు.
భారత నావికా దళానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. ఇప్పటికే 13 సాధారణ సబ్మెరైన్లు, రెండు అణుజలాంతర్గాములు భారత్ వద్ద ఉన్నాయి. కల్వారీ పేరుతో ఇప్పటికే స్కార్పియన్ శ్రేణి సబ్మెరైన్ ఒకటో దశ పరీక్షలను దాటింది. దీనిని త్వరలో భారత నావికాదళానికి అందజేయనున్నారు. కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, స్కార్పీన్ శ్రేణి సబ్మెరైన్ల సమాచారం కొంత ఓ ఆస్ట్రేలియా పత్రికలో ప్రచురితమై సంచలనం సృష్టించింది. కానీ దీనివల్ల సబ్మెరైన్ పనితీరుపై ఎటువంటి ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. భారత్ ఖండేరి సబ్మెరైన్ను శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పాకిస్థాన్ కూడా ఇదే తరహా సబ్మెరైన్ నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి.