వలసపోని ఎమ్మెల్యేలు.. శశికళలో కొత్త ఉత్సాహం..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఊహించిన స్థాయిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వలస వెళ్లకుండా చేయడంలో ఇంతవరకు విజయం సాధించిన శశికళలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వరుసగా ఆదివారు కూడా కువత్తూరు క్యాంప్లో ఉన్న తన మద్దతుదార్లైన ఎమ్మెల్యేలను కలిసిన శశికళ మన
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఊహించిన స్థాయిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వలస వెళ్లకుండా చేయడంలో ఇంతవరకు విజయం సాధించిన శశికళలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వరుసగా ఆదివారు కూడా కువత్తూరు క్యాంప్లో ఉన్న తన మద్దతుదార్లైన ఎమ్మెల్యేలను కలిసిన శశికళ మన ఐక్యత ఇలాగే ఉంటే ఢిల్లీనైనా ఢీ కొట్టవచ్చని చెబుతూ స్ఫూర్తి కలిగించారు. ఎన్నో కష్టాలు అనుభవించా... నాకు జైళ్లు కొత్త కాదని, ఆడదాన్నని అణగదొక్కాలనుకుంటే ‘అమ్మ’లా గర్జిస్తానని హూంకరించారు. అసెంబ్లీలో జయలలిత ఫొటో మనమే పెడదాం.. ఇది ఖాయమని ధైర్యం నూరిపోశారు.
పన్నీర్ సెల్వం కుట్రలకు లోను కాకుండా తమ చెంత నిలిచిన ఎమ్మెల్యేలను శశికళ ఒక రేంజిలో పొగిడేశారు. ఇక్కడున్న మీరంతా సింహాలే.. మీతో పాటు నేనూ ఒక సింహమే. భయపెట్టడం తప్ప మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయితే, మన జగ్రత్తలో మనం ఉండాలి. మనమంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి అంటూ వారిని ఆకాశానికెత్తేశారు. ఆదివారం రాత్రి మహాబలిపురం సమీపంలోని కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్లో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ ఎరుపెక్కిన కళ్లతో విలపిస్తూ గంటసేపు మాట్లాడారు.
జయలలితతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించాను. చెన్నై జైలు కొత్తకాదు.. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచి బయటకు వచ్చాం. మళ్లీ అధికారం చేజిక్కించు కున్నాం. మహిళ అనుకుని భయపెట్టి, అణగ దొక్కాలని చూస్తే ‘అమ్మ’లాగే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు రెడీ. ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే దమ్మూ «ధైర్యం నాకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తేల్చిచెప్పారు.
మనందరి ముందు పెద్ద బాధ్యత ఉంది. ‘అమ్మ’ ఫొటో ముందు ప్రతిజ్ఞ చేద్దాం. 125 మంది నేరుగా ‘అమ్మ’ సమాధి వద్దకు వెళదాం. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో అడుగుపెడదాం. అసెంబ్లీ లోపల జయలలిత ఫొటో పెట్టబోతున్నాం.. ఇది ఖాయం. మీరంతా నా వెంట ఉంటే నాకు కోటి మందితో సమానం. ఇక్కడున్న వారంతా సంపన్నులు కాదు. పేదవాళ్లూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది ‘అమ్మ’ దయ. కిందిస్థాయి కార్యకర్త కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ‘అమ్మ’ ఆకాంక్ష.. ఇది కొనసాగుతుంది. అమ్మ ఫొటో అసెంబ్లీలో ఉండాల్సిందే.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.. మనమంతా ఒకటిగా ఉందాం’’ అని శశికళ పిలుపునిచ్చారు.
తమిళ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ‘అమ్మ’ అధికారాన్ని మనకు అప్పగించి వెళ్లారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేను మాత్రమే కాదు, మీరంతా శ్రమించాలి. వరుసగా మూడోసారి (వచ్చే ఎన్నికల్లో ) మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే శక్తిగా ఎదగాలి. బ్రహ్మాండమైన పరిపాలనతో ప్రజల మన్ననలు అందుకుని, రానున్న లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాలు (పుదుచ్చేరితో కలిపి) గెలుచుకుని ‘అమ్మ’ సమాధి వద్ద కానుకగా సమర్పిద్దాం అని శశికళ ప్రసంగం ముగించారు.